Pamban Bridge : త్వరలోనే అందుబాటులోకి పంబన్ కొత్త రైల్వే వంతెన.. ఏప్రిల్ 6న ప్రారంభం

Pamban Bridge : వచ్చే నెల 6న శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించనున్నారు. అదేరోజు పంబన్ కొత్త రైల్వే వంతెనను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం ప్రధాని రామేశ్వరం రామనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ వంతెన 2.5 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ వంతెన భారత ప్రధాన భూభాగంతో రామేశ్వరం దీప్వాన్ని కలుపుతుంది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన వంతెనపై రైలు ప్రయాణించేందుకు 25 నుంచి 30 నిమిషాల సమయం పట్టగా, కొత్తగా నిర్మించిన వంతెనపై ఐదు నిమిషాల్లోనే దూసుకెళ్లనున్నది.
ఆసియాలోనే తొలిసారిగా..
ఆసియాలోనే తొలిసారిగా వర్టికల్ లిఫ్ట్ను వంతెనను రైల్వేశాఖ నిర్మించింది. పాత పంబన్ బ్రిడ్జి స్థానంలో వంతెన అందుబాటులోకి రానున్నది. పాత వంతెన 1914 ఏడాదిలో నిర్మించారు. వంతెన తప్పుపట్టి శిథిలావస్థకు చేరగా, 2022లో మూసేశారు. రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ రూ.535 కోట్లతో నిర్మించింది. గతేడాది నవంబర్లో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే వంతెన పూర్తయ్యిందని.. త్వరలోనే అందుబాటులోకి రానున్నదని సమాచారం అందించారు. 104 ఏళ్ల రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించిందని, తుప్పుపట్టడం వల్లే రాకపోకలు నిలిచిపోయాయన్నారు. దాని సమీపంలో నూతన పంబన్ వంతెనను నిర్మించామన్నారు.
నూతనంగా నిర్మించిన వంతెనపై ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. రైల్వే సేఫ్టీ కమిషనర్ వంతెనపై 75 కిలోమీటర్ల వేగంతో రైలు వెళ్లేందుకు అనుమతి ఇచ్చిందని ఆర్వీఎన్ఎల్ సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. నూతన వంతెనకు తుప్పు సమస్య రాకుండా మూడు పొరల పాలీసిలోక్సేన్ పెయింట్ వేశారు. దాంతో 58 ఏళ్ల వరకు తుప్పు ముప్పు ఉండదు. సముద్రంలో వేసిన దిమ్మెలకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా కేసింగ్ విధానంలో ఐరన్ చట్రాలతో కాంక్రీట్ వేశారు.
వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిలో ఒక బోల్డును వాడకపోడం విశేషం. వెల్డింగ్తోనే జోడించారు. వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సర్లతో లింక్ చేయగా, గంటకు 58 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తే స్కాడా సెన్సార్లు ఆటోమేటిక్గా వంతెనను మూసివేస్తాయి. మత్స్యకారుల పడవలు, నేవీ, పోర్టుల నుంచి వచ్చే ఓడలు వంతెనను దాటాల్సి వచ్చిన సమయంలో సిబ్బంది దిమ్మెల వద్ద ఏర్పాటు చేసిన గదుల్లోకి వెళ్లి రిమోట్ ద్వారా వంతెన లిఫ్ట్ని ఆపరేట్ చేస్తుంటారు.