Shashi Tharoor : కాంగ్రెస్ లిస్ట్ కాదని.. శశిథరూర్ వైపు కేంద్రం మొగ్గు

MP Shashi Tharoor gets a place in the all-party team : ఇండియాపై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోన్న పాక్ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేసేందుకు కేంద్రం పూనుకుంది. పాకిస్థాన్ ఉగ్రవాద కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించటానికి 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతినిధుల బృందాలకు 7 మంది ఎంపీలు నాయకత్వం వహిస్తున్నారు. అందులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ పేరు ఉంది. కాంగ్రెస్ పార్టీ పంపిన లిస్టులో శశిథరూర్ పేరు లేకపోవడం గమనార్హం.
ఈ నెల 16న పేర్లు పంపాలని ప్రతిపాదన..
పాకిస్థాన్ను ఎండగట్టేందుకు పంపే బృందం కోసం లిస్టు పంపాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ నెల 16వ తేదీన కాంగ్రెస్ పార్టీని కోరారు. అదేరోజు కాంగ్రెస్ అగ్రనాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ నాలుగు పేర్లను కేంద్రానికి పంపారు. లిస్టు పంపిన వారిలో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్ హుస్సేన్, లోక్సభ ఎంపీ రాజా బ్రార్, మరో నేత గౌరవ్ గొగొయ్ ఉన్నారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తెలిపారు. కాంగ్రెస్ పంపిన లిస్ట్లో శశిథరూర్ పేరు లేదు. అయితే ఇవాళ కేంద్రం విడుదల చేసిన తుది జాబితాలో కాంగ్రెస్ పంపిన పేర్లు లేవు. కానీ, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్కు అనూహ్యంగా చోటు దక్కింది.
నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నా : శశిథరూర్
ఇటీవల దేశంలో జరిగిన పరిణామాలపై భారత్ విధానాన్ని ప్రపంచ దేశాలకు వివరించేందుకు వెళ్తున్న బృందానికి నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నానని శశిథరూర్ సంతోషం వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాలతో ముడిపడిన సందర్భాల్లో అక్కడ తన అవసరం ఉంటే అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ సందర్భంగా జైహింద్ అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
ఏడుగురు వీరే..
కాంగ్రెస్ నుంచి ఎంపీ శశిథరూర్, బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా ఉన్నారు. జేడీయూ నుంచి సంజయ్కుమార్, డీఎంకే నుంచి కనిమొళి, ఎన్సీపీ -ఎస్పీ నుంచి సుప్రియా సూలే ఉన్నారు. శివసేన నుంచి శ్రీకాంత్ శిందే విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్ ఏ విధంగా మద్దతు పలుకుతోందనే విషయం, ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు బృందాలు వివరించనున్నట్లు సమాచారం.