Published On:

Army Jawan : సరిహద్దుల్లో జవాన్.. దుబ్బాకలో భూమి కబ్జా.. కాపాడాలని సీఎంకు విజ్ఞప్తి

Army Jawan : సరిహద్దుల్లో జవాన్.. దుబ్బాకలో భూమి కబ్జా.. కాపాడాలని సీఎంకు విజ్ఞప్తి

Army jawan land grab : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ భూమి కబ్జా తీవ్ర కలకలం రేపుతోంది. తన భూమిని కబ్జా నుంచి కాపాడాలంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి సోషల్ మీడియాలో వీడియో ద్వారా జవాన్ విజ్ఞప్తి చేశారు. దేశ సరిహద్దుల్లో తాను పోరాడుతుంటే.. తమ భూమిని కబ్జా చేశారంటూ అక్బర్‌పేట మండలం చౌదర్‌పల్లికి చెందిన రామస్వామి అనే ఆర్మీ జవాన్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తమ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని సీఎంకు విన్నవించారు. ప్రస్తుతం వీడియో తెలంగాణ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.

 

కుటుంబాన్ని బెదిరిస్తున్న కబ్జాదారులు..
దేశ సరిహద్దుల్లో తాను పోరాడుతున్నానని, తన సొంత గ్రామంలో తన భూమిని కొంతమంది కబ్జా చేశారని జవాన్ రామస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. భూమి విషయంలో నిలదీస్తున్న తన కుటుంబాన్ని కబ్జాదారులు బెదిరిస్తున్నారని తెలిపారు. తమ భూమిని కబ్జా చేసిన వ్యక్తి సోదరుడు వీఆర్వో అని, అధికారులు వారికే మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. తహసీల్దార్ కబ్జాదారుడి తరఫున మాట్లాడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమిని తనకు ఇప్పించాలని ఆర్డీవో, జిల్లా అధికారులు, కలెక్టర్‌ను కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని జవాన్ వాపోయారు. ఎలాగైనా తమ భూమిని తిరిగి ఇప్పించాలని వీడియో ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జవాన్ విజ్ఞప్తి చేశారు.

 

న్యాయం చేయాలి..
తన సోదరుడికి చెందిన ఎకరం భూమిని చుక్కా రమేశ్ అనే వ్యక్తి తన అన్నదమ్ముల పేరుపై మార్చుకున్నాడని జవాన్ సోదరుడు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డిని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సీఎం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి తమ భూమిపై తమకే హక్కులు కల్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై జిల్లా మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించి వెంటనే కలెక్టర్‌తో మాట్లాడారు. ఆర్మీ జవాన్‌‌కు చెందిన భూమిపై వెంటనే విచారణ జరిపి, అతడిని న్యాయం చేయాలని హరీశ్‌రావు చెప్పినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: