Amit Shah : అణ్వాయుధ బెదిరింపులకు భయపడం : పాకిస్థాన్కు అమిత్ షా వార్నింగ్

Union Home Minister Amit Shah : దేశాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధాని మోదీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గాంధీనగర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో షా మాట్లాడారు. 2014 ఏడాదకి ముందు ప్రతిరోజూ ఉగ్రవాద దాడులు జరిగాయని గుర్తుచేశారు. కానీ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని విమర్శించారు. ఇప్పుడు అలా కాదని, శత్రు దేశం పాక్కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. భారత్ సైన్యం ఇటుకలకు రాళ్లతో ప్రతి స్పందించిందన్నారు. తాము గర్వంగా తలలు పైకెత్తామన్నారు. అణు ముప్పుకు తాము భయపడటం లేదని వ్యాఖ్యానించారు.
బార్డర్ నుంచి 100 కిలోమీటర్ల లోపల దాడులు..
భారత వైమానికి దళం పాక్లోకి 100 కిలోమీటర్లు చొరబడి దాడులు చేసిన విధానాన్ని షా గుర్తు చేశారు. తాము అణ్వాయుధ బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు. భారత్ సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల లోపల దాడులు చేసినట్లు చెప్పారు. పాక్ వైమానిక స్థావరాలను ఇండియా ధ్వంసం చేసిందన్నారు. భారత్ వాయు రక్షణ వ్యవస్థ చాలా బలంగా ఉందని చెప్పారు. దీన్ని చూసి పాక్ భయపడుతోందన్నారు.
2014 ఏడాది ముందు ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చేవారని, పాక్ ఉగ్రవాదులు మన సైన్యాన్ని చంపి వెళ్లిపోయేవారని తెలిపారు. గత ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇవ్వలేదన్నారు. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఉగ్రవాదులు మూడు పెద్ద దాడులకు పాల్పడ్డారని గుర్తుచేశారు. ఇటీవల పాక్ స్పాన్సర్ చేసిన ఉగ్రవాదులు పహల్గాంపై దాడి చేశారని, కానీ ప్రతి దాడిపై ప్రధాని మోదీ స్పందించారన్నారు. ఈ రోజు ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా చూస్తుందన్నారు. పాక్ మాత్రం భయంతో వణుకుతోందని అమిత్ షా వ్యాఖ్యానించారు.