Spying : యూట్యూబర్ జ్యోతి మల్హో త్రా ఎవరు?

Six Indians, including YouTuber Jyoti, Arrested : పహల్గామ్ ఉగ్రదాడితో అధికారులు అలర్ట్ అయ్యారు. జమ్మూ కశ్మీర్ సహా సరిహద్దు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు. పాకిస్థాన్ అధికారులకు కీలక సమాచారాన్ని చేరవేస్తున్న వారి గుట్టును రట్టుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక సమాచారాన్ని పాకిస్థాన్ అధికారులతో పంచుకుంటున్న హర్యానాకు చెందిన ఓ యూట్యూబర్ సహా ఆరుగురు భారతీయులను అధికారులు అరెస్టు చేశారు.
ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హో త్రా అరెస్టు..
పాక్కు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రాతోపాటు ఆరుగురు భారతీయులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెట్వర్క్ హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో విస్తరించినట్లు గుర్తించారు. వీరు పాకిస్థాన్ ఐఎస్ఐకి ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.
ట్రావెల్ వ్లాగర్ జ్యోతి నేపథ్యం..
ట్రావెల్ వ్లాగర్ జ్యోతి అనే మహిళ ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ నడుపుతోంది. కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొందింది. ఆమె 2023లో పాకిస్థాన్ను సందర్శించింది. ఎవరికీ అనుమానం రాకుండా పాకిస్థాన్ అధికారులకు సున్నితమైన సమాచారం చేరవేస్తున్నట్లు తేలింది. కేసులో జ్యోతి మల్హోత్రా ట్రావెల్ వ్లాగర్తో కలిసి పనిచేస్తున్నట్లు గుర్తించారు. మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడింది. ఈ ముఠా హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో నుంచి గూఢచారిగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఉద్యోగి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్తో జ్యోతి మల్హోత్రా పరిచయాలు పెంచుకుంది.
డానిష్ను బహిష్కరించిన ప్రభుత్వం..
డానిష్ను ప్రభుత్వం ఇటీవల బహిష్కరించింది. డానిష్ గురించి వివరాలు బయటకు లాగడంతో జ్యోతి గురించి వెలుగులోకి వచ్చింది. పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లకు డానిష్ జ్యోతి మల్హోత్రాను పరిచయం చేసినట్లు తేలింది. వాట్సాప్, టెలిగ్రాం, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్ట్ చేసిన ప్లాట్ఫామ్ల ద్వారా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్తో ప్రతిరోజూ టచ్లో ఉంటున్నట్లు గుర్తించారు. ప్లాట్ఫామ్స్ ద్వారా ఇండియాకు చెందిన కీలక సమాచారం పాకిస్థాన్ అధికారులకు చేరవేసినట్లు తెలిసింది. జాట్ రంధావా అని సేవ్ చేసుకున్న పేరు షకీర్ అలియాస్ రాణా షాబాజ్ అనే పాకిస్థాన్ వ్యక్తిదిగా అధికారులు గుర్తించారు.
సోషల్ మీడియా వేదికగా నిత్యం ఇమేజ్లు పోస్టు..
దేశంలోని ప్రదేశాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్తో పంచుకున్నట్లు తేలింది. సోషల్ మీడియా వేదికగా పాకిస్థాన్ సానుకూల ఫొటోలను ప్రతిరోజూ పోస్టు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఓ పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్తో సన్నిహితంగా మెలుగుతున్నట్లు తేలింది. అతడితో ఆమె అంతర్జాతీయ ట్రిప్కు వెళ్లింది. ఇండోనేషియాలోని బాలికి విహారయాత్రకు వెళ్లి వచ్చినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. జ్యోతిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 152 సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. దర్యాప్తులో తాను తప్పు చేసినట్లు జ్యోతి అంగీకరించినట్లు సమాచారం. జ్యోతి సహా మరో ఐదుగురి గుట్టును అధికారులు బయటపెట్టారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.