NEET: నీట్ ఫలితాలకు బ్రేక్.. స్టే ఇచ్చిన మద్రాస్ కోర్ట్

Madras Court: దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు గాను జాతీయస్థాయిలో మే 4న నీట్ యూజీ 2025 ఎంట్రెన్స్ టెస్ట్ జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన ఈ పరీక్షకు 23 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 21 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. త్వరలోనే నీట్ యూజీ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
నీట్ యూజీ 2025 ఫలితాల విడుదలను ఆపాలంటూ స్టే విధించింది. దీంతో నీట్ రిజల్ట్స్ విడుదలకు బ్రేక్ పడింది. కాగా ఈ అంశంపై తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. కాగా నీట్ ఫలితాల విడుదలను తాత్కాలికంగా నిలిపివేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ కూడా ఆదేశాలు జారీ చేసింది.
అయితే నీట్ పరీక్షా కేంద్రాల్లోని ఒక చోట విద్యుత్ సరఫరా ఆగిపోవడం వల్ల జరిగిన వివాదం కారణంగా నీట్ ఫలితాలను ఆపాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. తమ పరీక్షా కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల వెలుతురు సరిగా లేకుండానే పరీక్ష రాయాల్సి వచ్చిందని, కరెంట్ సరఫరా పునరుద్దరించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని 13 మంది విద్యార్థులు పిటిషన్ వేశారు.