PM Modi : మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా కమిటీ సమావేశం.. పహల్గామ్ ఉగ్రదాడిపై చర్చ

High-Level Security Meet : జమ్మూకశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతిచెందారు. పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడి పిరికిపంద చర్యగ అభివర్ణించారు. తాజాగా జమ్మూకశ్మీర్లో జరిగిన ఘటనపై ప్రధాని మోదీ నివాసంలో ఉన్నత స్థాయి భద్రతా కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర ఉన్నతాధికారులు, ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం జరిగిన పరిణామాలు, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులపై ప్రధాని చర్చించారు.
మంగళవారం పహల్గామ్లోని బైసరన్లో పర్యాటకులపై ఉగ్రవాదులు ఏ మతానికి చెందిన వారో తెలుసుకుని చంపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు విదేశీయులతోపాటు 28 మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. బుధవారం బాధిత కుటుంబాలు, దాడిలో ప్రాణాలతో బయటపడిన వారితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు.
మరోవైపు ఢిల్లీలో సీనియర్ రక్షణ అధికారులతో కలిసి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశం కూడా నిర్వహించారు. జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. సాయుధ బలగాలు తమ పోరాటాన్ని మరింత పెంచుకోవాలని ఆయన సూచించారు. లోయలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రం చేయాలని ఆదేశించారు. పహల్గామ్ ఉగ్రదాడికి తెరవెనుక ఉన్న ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని రాజ్నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. పరోక్షంగా పాకిస్థాన్ను ఆయన హెచ్చరించారు. కుట్రకు పాల్పడిన ప్రతిఒక్కరినీ ఇండియా గుర్తించి న్యాయం చేస్తుందన్నారు.