Kohinoor : కోహినూర్ వజ్రాన్ని భారత్కు తిరిగి ఇచ్చేస్తారా..? బ్రిటన్ మంత్రి ఏమన్నారంటే?

Kohinoor : బ్రిటన్ మహారాణి ధరించిన కోహినూర్ వజ్రం ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వజ్రాన్ని తిరిగి ఇండియాకు ఇచ్చేస్తారా? అన్న ప్రశ్నకు బ్రిటన్ సాంస్కృతిక, మీడియా, క్రీడల శాఖల మంత్రి లీసా నాండీ బదులు ఇచ్చారు. ఇండియా, బ్రిటన్ రెండు దేశాల మధ్య సాంస్కృతిక కళాఖండాల మార్పిడి కోసం ఉన్నతస్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నట్లు చెప్పారు. అనుకున్నట్లు జరిగితే మంచి నిర్ణయం రావొచ్చని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై ఇండియా సాంస్కృతిక శాఖ మంత్రితో చర్చించినట్లు చెప్పారు. అధికారిక పర్యటనలో భాగంగా ప్రస్తుతం లీసా నాండీ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
క్రీడారంగాల్లో ఇండియాలో దృఢమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్లు లీసా తెలిపారు. సినిమా, టీవీ, మ్యూజిక్, క్రీడా రంగాల్లో బ్రిటన్ దూసుకుపోతుందని తెలిపారు. ఆయా రంగాలకు సంబంధించిన బ్రిటన్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని చెప్పారు. ఇండియా సహకరిస్తే వాటిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లొచ్చని నమ్మకం తమకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు ఇండియా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నామని లీసా తెలిపారు. ఇండియా పర్యటన కోసం శుక్రవారం ఢిల్లీకి చేరుకుంది. సాంస్కృతిక శాఖకు సంబంధించిన పలు ఒప్పందాల గురించి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో ఆమె చర్చలు జరుపుతున్నారు.
జమ్ముకాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిపై కూడా ఆమె స్పందించారు. ఈ ఘటనలో మృతిచెందిన 26 మంది పర్యాటకులకు నివాళులర్పించారు. ఉగ్రవాదం నిర్మూలనకు ప్రపంచదేశాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇండియాకు చెందిన 108 క్యారెట్ల కోహినూర్ వజ్రాన్ని 1849లో మహారాజ్ దులీప్సింగ్ విక్టోరియా మహారాణికి ఇచ్చారు. అప్పటి నుంచి వజ్రం వారి ఆధీనంలో ఉంది. రాణి కిరీటంలో అమర్చారు. వజ్రాన్ని తిరిగి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం దౌత్యమార్గాల్లో ప్రయత్నించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.