Sivananda Swami : ప్రముఖ యోగా గురువు స్వామి శివానంద కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం

Famous yoga guru Sivananda Swami : ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద (128) కన్నుమూశారు. వారణాసిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు సన్నిహితులు తెలిపారు. 1896 ఆగస్టు 8న అవిభాజ్య భారత్లోని సిల్హెత్ (ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉది) జిల్లాలో నిరుపేద కుటుంబంలో జన్మించారు.
స్వామి శివానంద ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మృతిచెందారు. దీంతో ఆయన పశ్చిమ బెంగాల్లో ఉన్న ఓ ఆశ్రమంలో పెరిగారు. గురు ఓంకారానంద గోస్వామి శివానంద స్వామిని పెంచారు. కాగా, యోగా వంటి ఆధ్యాత్మిక విషయాలను బోధించారు. ఈ క్రమంలో తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేశారు. 50 ఏళ్లుగా పూరిలో 400-600 కుష్టు రోగులకు సేవచేశారు. యోగా రంగానికి శివానంద స్వామి చేసిన కృషికి 2022లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. తెల్ల ధోవతి, కుర్తా ధరించి, చెప్పులు కూడా లేకుండానే వచ్చి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకొని అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించారు.
ప్రధాని మోదీ సంతాపం
శివానంద స్వామి మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. స్వామి శివానంద మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆధ్యాత్మిక సాధన, యోగా రంగానికి ఆయన చేసిన కృషి తరతరాలకు ఆదర్శనీయమన్నారు. యోగా ద్వారా స్వామి శివానంద చేసిన సమాజ సేవకు గుర్తింపుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారని ప్రధాని గుర్తుచేశారు. స్వామీజీ మృతి యోగా రంగానికి తీరని లోటన్నారు. స్వామీజీకి హృదయపూర్వక నివాళులర్పిస్తున్నానని చెప్పారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వామీజీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.