Published On:

Former BRS MLA Shakeel : బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అరెస్టు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Former BRS MLA Shakeel : బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అరెస్టు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Former BRS MLA Shakeel : బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లో షకీల్‌పై అరెస్టు వారెంట్‌లు జారీ అయ్యాయి. ప్రజాభవన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి తన కొడుకును రక్షించేందుకు షకీల్ ప్రయత్నించారనే అభియోగాలు ఉన్నాయి.

 

అరెస్టు భయంతో దుబాయ్‌కి..
అరెస్టు భయంతో కొన్ని నెలలుగా షకీల్ దుబాయ్‌లో ఉంటున్నారు. షకీల్ తల్లి అనారోగ్యంలో మృతిచెందగా, అంత్యక్రియల కోసం దుబాయ్ నుంచి వచ్చారు. నేరుగా శంషాబాద్‌ విమానాశ్రయంలో ఫ్లైట్ దిగగా, పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియల కోసం బోధన్‌కు తీసుకెళ్లి తర్వాత పోలీస్ స్టేషన్‌కు తరలించే అవకాశాలు ఉన్నాయి. షకీల్‌ అమీర్‌ మహమ్మద్‌ గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున రెండుసార్లు బోధన్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనపై పోలీసులు గతంలో లుకౌట్‌ నోటీసులు కూడా జారీ చేశారు.

 

 

కొడుకు సాహిల్‌ను తప్పించి..
2023 డిసెంబర్‌ 23వ తేదీ రాత్రి అతివేగంగా దూసుకొచ్చిన కారు ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్‌ బారికేడ్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు అబ్దుల్‌ ఆసిఫ్‌ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలో అసలు సంగతి బయటపడింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్‌ కారును నడపగా, అతడిని తప్పించేందుకు షకీల్‌ తన ఇంటి పని మనిషి ఆసిఫ్‌పై కేసు నమోదు చేయించారు. దీంతో సాహిల్‌ను కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు మార్చారు. అటుపై పరారీలో ఉన్న సాహిల్‌ కోసం పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పంజాగుట్ట ఇనిస్పెక్టర్ దుర్గారావుపై సస్పెన్షన్‌ వేటు పడింది.

ఇవి కూడా చదవండి: