Rammohan Naidu : గ్లోబల్ యంగ్ లీడర్స్ అవార్డుకు ఎంపికైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Union Minister Rammohan Naidu : వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ యంగ్ లీడర్ జాబితాలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా తమరంగాల్లో ఉత్తమ నాయకత్వం కనబర్చిన యువ నాయకులను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎంపిక చేస్తుంది. ఈసారి ఇండియా నుంచి ఏడుగురు ఎంపికయ్యారు. అవార్డుపై రామ్మోహన్ నాయుడు స్పందించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రభావితమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో భారత యువత ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. నిజాయితీ, నూతన ఆలోచనలతో ప్రజలకు సేవ చేయాలని గుర్తింపు మరింత గుర్తుచేస్తుందన్నారు.
చిన్న వయసులో పార్లమెంట్ సభ్యుల్లో ఒకరిగా..
2014లో 26 ఏళ్ల అతి చిన్న వయసులో పార్లమెంట్ సభ్యుల్లో ఒకరు. 2024 నుంచి ప్రధాని మోదీ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రామ్మోహన్ నాయకత్వంలో పౌర విమానయాన శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది. విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల కల్పన నుంచి దేశంలోని వివిధ మారుమూల ప్రాంతాలకు వైమానిక సేవలను అభివృద్ధి చేసేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు.
తెలుగువారికి గర్వకారణం : సీఎం చంద్రబాబు
యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపికైన రామ్మోహన్ నాయుడుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అభినందనలు తెలిపారు. ప్రతిష్ఠాత్మక గుర్తింపు దేశానికి, తెలుగువారికి గర్వకారణం అన్నారు. ప్రజాసేవలో రామ్మోహన్ అంకితభావం, యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. రామ్మోహన్ యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపిక కావడం ఏపీకి, ఇండియాకు గర్వకారణమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ప్రేరణ పొందడం సంతోషంగా ఉందన్నారు. మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.