Pawan Kalyan : ఉపాధి శ్రామికులకు ప్రమాద బీమా రూ.30లక్షలు : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan face-to-face with workers : శ్రామికులు లేకపోతే దేశ నిర్మాణం లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మే డే సందర్భంగా మంగళగిరిలో ఉపాధి శ్రామికులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మిక దినోత్సవం నుంచి కూలీలు కాదని, ఉపాధి శ్రామికులని పిలుస్తామని హామీనిచ్చారు. శ్రామికుల మాటలు వింటే ఎంతో ఆనందం కలిగిందన్నారు. తాము కూడా చిన్నప్పుడు మూడెకరాల భూమిని అమ్ముకున్నట్లు వివరించారు. పాతికేళ్ల కింద ఎనిమిదెకరాల భూమిని కొన్నట్లు తెలిపారు. ఓట్ల కోసం తాను ఏ పని చేయడం లేదన్నారు. మూగ జీవాలకు చేస్తే ఓటు వేయవని, తమకు ఓటు గురించి ఆలోచన లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ దాహార్తి నుంచి మూగజీవాలను రక్షించడానికి పూనుకుందిదని తెలిపారు.
అధికారులు ప్రత్యేక దృష్టి..
పంచాయతీరాజ్ నిధులు ప్రస్తుతం ఏపీకి ఆక్సిజన్ అయ్యాయని గుర్తుచేశారు. గత ఆర్థిక సవత్సరంలో రూ.10,669 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. వేతనాలకు రూ.6,190 కోట్లు ఖర్చే చేయగా, మిగిలిన డబ్బులు మెటీరియల్ కింద ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. పల్లె పండుగలో భాగంగా రూ.377.37 కోట్లతో రూ.21,564 గోకులాలు పూర్తి చేశామన్నారు. 13,500 పశువుల తొట్టెలు రూ.60.75 కోట్లతో పూర్తి చేయడానికి కారణం శ్రామికులేనని కొనియాడారు. రూ.1800 కోట్లతో 36వేల ఎస్సీ, ఎస్టీ, ఇతర కాలనీల్లో రోడ్లు వేశామని తెలిపారు. ఉపాధి శ్రామికుల సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు. ఉపాధి శ్రామికుడు పని ప్రదేశంలో మృతిచెందితే ఇప్పుడు రూ.2లక్షలకు పెంచినట్లు గుర్తుచేశారు.
ఉదయం 11లోపు పని పూర్తిచేయాలి..
ఉపాధి శ్రామికులు ఎండాకాలం ఉదయం 11లోగా పనులు పూర్తిచేయాలని సూచించారు. అవసరమైతే సాయంత్రం 4 గంటల తర్వాత పని చేయాలని కోరారు. ఉపాధి శ్రామికులకు గ్రామాల్లో ఏఎన్ఎంల సేవలు, వైద్య సదుపాయం ఉంటుందని చెప్పారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి శ్రామికులకు రూ.3 లక్షల నుంచి రూ.30లక్షల ఉచిత ప్రమాద బీమా ఇవ్వడానికి ఎస్బీఐతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఉపాధి శ్రామికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. పని చేసే వాళ్లు ముందుంటే దేశం వెనుకబడదని సమెత చెప్పారు. పని చేసేవాళ్లకు గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు.