Published On:

PM Modi Tour: రేపు అమరావతికి ప్రధాని.. భారీగా పోలీసు బందోబస్తు

PM Modi Tour: రేపు అమరావతికి ప్రధాని.. భారీగా పోలీసు బందోబస్తు

Amaravati: ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభించనున్నారు. అలగే సుమారు రూ. 50 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అందుకు సంబంధించి నేతలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రధాని టూర్ కోసం సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలను ఆరా తీస్తున్నారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.

మరోవైపు అమరావతిలో ప్రధాని సభ జరగనున్న ప్రదేశాన్ని ఏస్పీజీ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. హెలీప్యాడ్ నుంచి సభా వేదిక వరకు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. అందుకోసం భారీగా బలగాలను మొహరించారు.

ప్రధాని పర్యటన కోసం ఏపీ ప్రభుత్వం అన్నిరకాల చేపట్టింది. అందుకోసం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. మోదీ సభ, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు వంటి విషయాలను ఈ కమిటీ చర్చించుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. వేదికపైన ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సభకు భారీగా జన సమీకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే వేసవి దృష్ట్యా ప్రజలకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచుతోంది.

ఇక సభకు ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎక్కువ మంది రానున్నట్టు నేతలు అంచనా వేస్తున్నారు. అందుకోసం తగిన రవాణా ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ, స్కూల్ బస్సులను అందుబాటులో ఉంచుతోంది. ప్రతీ బస్సులో ఆహారం, అరటిపండ్లు, మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచుతోంది. సభకు వచ్చే వారు మార్గమధ్యలోనే ఆహారం తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. అలాగే సభ నుంచి తిరుగు ప్రయాణంలో కూడా ప్రజలకు ఆహారం అందించనున్నారు. ప్రజలకు వారి బస్సు వద్దే ఆహారం అందుబాటులో ఉండనుంది. అలాగే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యబృందాలను ఏర్పాటు చేశారు.