Pawan Kalyan: భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు.. వారి త్యాగాలు మరిచిపోం

Amaravati: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు తలవంచి మొక్కుతున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత ఐదేళ్లుగా వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. పోలీసులతో లాఠీ దెబ్బలు బారిన పడ్డారని.. అమరావతి కోసం వారు చేసిన పోరాటాన్ని ఎన్నటికీ మరిచిపోలేమని తెలిపారు. చివరికి 2000 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని.. అందుకు తగ్గట్టుగానే ప్రధాని నరేంద్ర మోదీతో రాజధాని పనులు పునఃప్రారంభించుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. న్యాయపోరాటంలో అమరావతి రైతులే విజయం సాధించారని చెప్పుకొచ్చారు.
అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. రాజధాని కోసం వారు చేసిన త్యాగాలను ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాలు ఇచ్చిన 29 వేల మంది రైతులకు ధన్యవాదాలు చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనలో అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. గతంలో సైబరాబాద్ నగరాన్ని చంద్రబాబు ఎలా సృష్టించారో.. అదే విధంగా అమరావతిని కూడా అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మనమంత వారికి అండగా నిలవాలని కోరారు. రాజధాని పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి విచ్చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు ప్రధాని నరేంద్ర మోదీకి ఎప్పుడూ ఉంటాయని అన్నారు.