Published On:

PM Modi: అమరావతి నగరం కాదు.. శక్తి .. కేంద్రం అండగా ఉంటుంది

PM Modi: అమరావతి నగరం కాదు.. శక్తి .. కేంద్రం అండగా ఉంటుంది

Amaravati: ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సుమారు రూ. 50 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు, రూ. 8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టుల పనులను వేదిక నుంచి ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు.. శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక్ ప్రదేశ్ గా, అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి’ అని అన్నారు. అమరావతి ఒక పుణ్యభూమి అని, అలాంటి పుణ్యభూమిపై తాను నిలబడి ఉండటం, దుర్గా భవానీ మాత కొలువైన భూమిలో అందరినీ కలవడం ఆనందంగా ఉందన్నారు.

అమరావతి కేవలం నగరమే కాదని.. ఐదు కోట్ల మంది ప్రజల కల అని అన్నారు. ఇంత గొప్ప రాజధాని ప్రాంతాన్ని ప్రారంభించడం గర్వంగా భావిస్తున్నట్టు చెప్పారు. అమరావతి దేశంలోనే నెంబర్ వన్ నగరంగా అవుతుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రజల కల నెరవేరుతుందని తెలిపారు. వేగం, క్లారిటీ, టెక్నాలజీతో నిర్మాణం జరగాలంటే చంద్రబాబే అందుకు సరైన వ్యక్తి అని కితాబిచ్చారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసే సమయంలో తాను.. దగ్గర నుంచి చూసి నేర్చుకున్నానని వివరించారు. రాజధానిని వేగంగా అభివృద్ధి చేసే క్రమంలో ఏపీకి కేంద్రం ఎప్పుడు సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.

తాను, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ఏపీ ప్రజలకు అద్భుతమైన నగరాన్ని అందిస్తామని చెప్పారు. తమ ముగ్గురిపై ఆ బాధ్యత ఉందన్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. రాష్ట్రంలో రైతులకు మంచి రోజులు తీసుకువస్తామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున తాను మళ్లీ ఏపీకి వస్తానని చెప్పారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు యోగా డే రోజు రాష్ట్రంలో పర్యటిస్తామని అన్నారు. వచ్చే 50 రోజులు ఏపీలో యోగాకు సంబంధించి విస్తృత కార్యక్రమాలు జరగాలని ప్రధాని పిలుపునిచ్చారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదేళ్లలో ఏపీకి భారీగా నిధులు కేటాయించామని గుర్తు చేశారు. గతంలో 2015 లో ఏపీ రాజధాని అమరావతి పనులకు భూమిపూజ చేశామని అన్నారు. అమరావతికి కేంద్రం అన్ని రకాలుగా సహకరించిందని.. రాబోయే రోజుల్లోనూ తమ మద్దతు ఉంటుందన్నారు. ఏపీలో రైల్వే, రవాణా, ప్రారిశ్రామికంగా, మౌలిక వసతులు కల్పించడంలో భారీగా నిధులు అందించామన్నారు. వికసిత్ భారత్ నిర్మాణం జరగాలంటే మహిళలు, కార్మికులు అభివృద్ధి చెందాలన్నారు. అలాగే రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు.