Telangana: రాష్ట్రాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తాం.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Hyderabad: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రోడ్డు రవాణ, జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా అంబర్ పేట ఫ్లైఓవర్, బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా అందరికీ నమస్కారం, బాగున్నారా.. అంటూ తెలుగులో ఉపన్యాసం ప్రారంభించారు.
రాష్ట్రంలో జాతీయ రహాదారులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇందుకు భారీగా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. అలాగే హైదరాబాద్ ను కూడా అన్ని రకాలుగా డెవలప్ చేస్తామన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ను త్వరగా పూర్తి చేసేందుకు తగిన ప్రణాళికలు చేస్తున్నామని.. రానున్న పది నెలల్లో దీనిని ప్రారంభిస్తామని తెలిపారు. అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ వేగంగా చేస్తుందని ఆకాంక్షించారు.
హైదరాబాద్- విజయవాడ రహదారిని ఇప్పుడున్న 4 లైన్ల నుంచి 6 లైన్లుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అలాగే హైదరాబాద్- శ్రీశైలం మార్గాన్ని కూడా 4 లైన్లకు విస్తరిస్తామని తెలిపారు. హైదరాబాద్ ఐటీ, ఫార్మా రంగాల్లో రోజురోజుకు పురోగతి సాధిస్తోందని గడ్కరీ అన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ లో ఉంటున్నారని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ను దేశంలోని వివిధ నగరాలతో కలిపేలా రహదారులు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అలాగే నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా రీజినల్ రింగ్ రోడ్డు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని వివరించారు.
నాగపూర్ తరహాలో డబుల్ డెక్కర్ ఎయిర్ బస్ ను హైదరాబాద్ లో ప్రయోగాత్మకంగా పరిశీలించాలని కోరారు. అలాగే కాలుష్యాన్ని తగ్గించే విధంగా సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు.