Ambati Rambabu : అమరావతి నిర్మాణంలో సీఎం చంద్రబాబు అట్టర్ ప్లాప్ : మాజీ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్

Former Minister Ambati Rambabu : ప్రధాని మోదీ సభలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అసత్యాలు మాట్లాడారని మాజీ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. అమరావతి ఒక అంతులేని కథ అని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి నిర్మాణంలో సీఎం చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారని మండిపడ్డారు. అమరావతి కోసం గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.41 వేల కోట్లకు పైగా టెండర్లు పిలిచి రూ.5,500 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అమరావతి భ్రమరావతి అయిందని ఎద్దేవా చేశారు. అందుకే చంద్రబాబును చిత్తుగా ఓడించారని తెలిపారు. పదేళ్లు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబుకు అవకాశం కల్పించారని, అక్కడ తంతే ఇక్కడికి వచ్చారని ఫైర్ అయ్యారు. లక్ష కోట్లతో అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి మన రాష్ట్రంలో ఆర్థిక వనరులు ఉన్నాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతి పేరుతో అందరినీ మోసం చేశారని ఆరోపించారు.
భూములు ఇచ్చిన రైతులకు మోసం..
రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు సీఎం చంద్రబాబు అభివృద్ధి చేసిన ప్లాట్లు కూడా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. అమరావతి విధ్వంసం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. తాము అన్ని వాస్తవాలు చెబుతున్నామని, జగన్ అమరావతిని అభివృద్ధి చేద్దామంటే కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని, చంద్రబాబు అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ నగరం అని చెబుతున్నారని, సెల్ఫ్ సస్టైనబుల్ నగరానికి రూ.52వేల కోట్లు ఎందుకు అప్పు చేశారని ప్రశ్నించారు. జగన్ అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతిలో శాసనసభకు రూ.2,271 కోట్లు టెండర్ పిలిస్తే ఇప్పుడు దాన్ని అంచనాలు పెంచారని ఆరోపించారు. ఇప్పుడు శాసన సభ నిర్మాణానికి రూ.4,689 కోట్ల అంచనాలు పెంచారని మండిపడ్డారు. అమరావతి పేరుతో ఇష్టం వచ్చినట్లుగా అప్పులు తెచ్చి దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కిలో మీటరు రోడ్డు నిర్మాణానికి రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నారని, వర్షం పడితే అమరావతి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు అని అంబటి చెప్పుకొచ్చారు.