AP CM Chandrababu : క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో అవగాహన ఒప్పందం.. సీఎం చంద్రబాబు హర్షం

AP CM Chandrababu : భారతదేశపు తొలి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటర్ ల్యాండ్ను అమరావతిలో ప్రారంభించడానికి కూటమి సర్కారు చరిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. శుభపరిణామాన్ని ప్రకటించడం సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా సీఎం పేర్కొన్నారు. 25వేల ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ప్రాజెక్టు రూపొందిందని వివరించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, పెద్దఎత్తున అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందని చెప్పారు. ఏపీలో స్థానికుల ప్రతిభను ప్రపంచానికి అందించే శక్తిమంతమైన సాధనంగా చెప్పారు.
ప్రపంచస్థాయి సృజనాత్మక టౌన్షిప్ చలనచిత్రం, గేమింగ్, సంగీతం, వర్చువల్ ప్రొడక్షన్, కథల తయారీతోపాటు ఏఐ ఆధారిత కంటెంట్కు కేంద్రంగా ఉంటుందని వెల్లడించారు. అధునాతన మౌలిక సౌకర్యాలు, ప్రపంచ భాగస్వామ్యాలు మన యువతకు నైపుణ్యం కల్పించడానికి క్రియేటర్ ల్యాండ్ అకాడమీ మంచి వేదిక కానుందని చంద్రబాబు తెలిపారు. సృజనాత్మక, డిజిటల్ పరిశ్రమలకు ప్రపంచ గమ్యస్థానంగా మారుతుందన్నారు.