Home Minister Anitha : ఏపీలో వర్షాలు.. తాజా పరిస్థితులపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా

Home Minister Anitha : ఏపీ వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్తో ఫోన్లో మాట్లాడారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ఆమె ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను హోంమంత్రి ఆదేశించారు. అవసరం అయితే సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని అనిత స్పష్టం చేశారు. తారునీరు, కరెంట్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ప్రకటించారు. రెండు రోజుల పాటు ఏపీలో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఆదివారం బాపట్ల జిల్లాలో వాన దంచికొట్టింది. చీరాల, వేటపాలెం, చినగంజాం, కారంచేడు తదితర మండలాల్లో భారీ ఉరుములు, గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో చీరాల పట్టణంలోని రహదారులు జలమయమయ్యాయి. చినగంజాం, పాత చీరాలతో పిడుగులు పడ్డాయి. చినగంజాంలోని రొంపేరు కాల్వ సమీపంలో పిడుగుపాటుకు బర్రెలు మేపుతున్న గడ్డం బ్రహ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. విజయవాడలో ఈదురుగాలులతో కూడిన పెద్ద ఎత్తున వర్షం కురిసింది. దీంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.