Pooja Khedkar : పోలీసుల ఎదుట హాజరుకండి.. పూజా ఖేద్కర్కు సుప్రీంకోర్టు ఆదేశం

Former probationary IAS officer Pooja Khedkar : తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగం సాధించిందని మాజీ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారంలో ఆ మధ్య కాలంలో ఆమె పేరు మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆమెపై యూపీఎస్సీ క్రిమినల్ కేసు కూడా నమోదు చేసింది. దీన్నిపై తాజాగా అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. వచ్చే నెల 2న ఢిల్లీ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని ఆమెను న్యాయస్థానం ఆదేశించింది.
విచారణను మే 21కి వాయిదా..
జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఆర్డర్ వేసింది. కేసు తదుపరి విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆమెపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోర్టు పేర్కొంది. కేసులో కచ్చితమైన విచారణ జరగలేదని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. విచారణ తొందరగా ముగించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పూజా ఖేద్కర్ను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కోర్టు ఆమెకు మధ్యంతర రక్షణ కల్పించింది.
తప్పుడు పత్రాలు సమర్పించారనే ఆరోపణలు..
పుణెలో ట్రెయినీ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమె అధికార దుర్వివినియోగానికి పాల్పడి, తప్పుడు ధ్రువ పత్రాలు సర్పించిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో యూపీఎస్సీ దర్యాప్తు చేపట్టింది. పూజా ఖేద్కర్ను ముస్సోరిలోని లాల్బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు యూపీఎస్సీ గుర్తించింది. పరీక్షపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఖేదర్క్పై ఫోర్జరీ కేసు నమోదు చేసి, అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.
హైకోర్టును ఆశ్రయించిన ఖేద్కర్..
దీంతో ఖేద్కర్ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఏ పత్రాలను ఫోర్జరీ చేయలేదని తెలిపారు. యూపీఎస్సీకి తనపై అనర్హత వేటువేసే అధికారం లేదని వాదించారు. అయినా ఖేద్కర్కు కోర్టులో నిరాశ ఎదురైంది. గతేడాది ఆగస్టులో ముందస్తు బెయిల్కు హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. కోర్టు దాన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోంది.