Air India : ఎయిర్ ఇండియా కీలక ప్రకటన.. రక్షణ సిబ్బందికి రిఫండ్

Air India : ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. రక్షణ సిబ్బందికి రిఫండ్ ఇవ్వనున్నది. విమాన ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్న రక్షణశాఖకు చెందిన ఉద్యోగులకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ డబ్బులు తిరిగి రిఫండ్ చేయనున్నది. ఈ నెల 31 వరకు టికెట్లు బుక్ చేసుకుని, ప్రయాణం రద్దు చేసుకున్న రక్షణ సిబ్బందికి డబ్బులు తిరిగి ఇవ్వనున్నట్లు ఎయిర్ ఇండియా గ్రూపు ఒక ప్రకటనలో పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జరిగిన పరిణామాల దృష్టా రక్షణశాఖ తమ సిబ్బందికి చెందిన సెలవులు కూడా రద్దు చేసింది. టికెట్ రద్దు చేసుకున్న వారికి పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వనున్నట్లు ఎయిర్ ఇండియా చెప్పింది. దీనిపై తన ఎక్స్ అకౌంట్లో పోస్టు పెట్టింది.
300 విమానాల షెడ్యూల్ కు అంతరాయం..
ఆపరేషన్ సింధూర్ తర్వాత 300 విమానాల షెడ్యూల్కు అంతరాయం ఏర్పడింది. ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో 10 ఎయిర్ పోర్టుల్లో కమర్షియల్ ఆపరేషన్స్ను నిలిపివేశారు. లేహ్, శ్రీనగర్ పట్టణం, జమ్మూ, ధర్మశాల, కాండ్లా, అమృత్సర్ తదితర ప్రాంతాలకు విమానాలను రద్దు చేసుకున్నట్లు ఇండిగో, ఆకాశ, స్పైస్జెట్ సంస్థలు ప్రకటించాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్థాన్లో ఉన్న తొమ్మిది ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.