IPL 2025: ఐపీఎల్ వాయిదా.. ఫ్యాన్స్ కు కీలక అప్డేట్

Cricket: భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. ఇరుదేశాలు డ్రోన్స్, మిస్సైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వహించింది. దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ పై డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించింది. వీటిని భారత రక్షణ వ్యవస్థ ధీటుగా ఎదుర్కొంది. మరోవైపు భారత్, పాక్ మధ్య పరస్పరం దాడులు సాగుతున్నాయి.
కాగా భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంలో ఐపీఎల్ నిర్వహణపై ఎఫెక్ట్ పడింది. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా ఐపీఎల్ ను వారం రోజులపాటు వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ తెలిపింది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఐపీఎల్ నిర్వహించడం భావ్యం కాదని బీసీసీఐ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ కోసం ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు ఆయా ఫ్రాంచైజీలు టికెట్ డబ్బులు రిఫండ్ చేస్తున్నాయి.
అయితే షెడ్యూల్ ప్రకారం.. రేపు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఐపీఎల్ వాయిదా పడటంతో మ్యాచ్ రద్దైంది. మ్యాచ్ టికెట్లు బుక్ చేసుకున్న వారు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్, కోల్ కతా మ్యాచ్ కు ఇప్పటివరకు టికెట్లు బుక్ చేసుకున్న వారికి త్వరలోనే రిఫండ్ చేస్తామని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో టీమ్ మేనేజ్మెంట్ ఓ పోస్ట్ పెట్టింది.