Indo-Pak tensions : జమ్మూకశ్మీర్ వెళ్లొద్దు.. యూఎస్, యూకే, కెనడా కీలక ఆదేశాలు

Indo-Pak tensions : పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరుతో పాక్పై ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్ దాడి చేసింది. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాడులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి.
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు..
భారత్, పాక్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ తదితర దేశాలు వారి పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేశాయి. జమ్మూకశ్మీర్కు వెళ్లొద్దని ట్రావెల్ అడ్వైజరీని జారీచేశాయి. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం, తమ పౌరులు సంఘర్షణ ప్రాంతాలను విడిచిపెట్టాలని భద్రతా హెచ్చరికలు జారీచేసింది. పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. దీనికి ముందు భారత్-పాకిస్థాన్ సరిహద్దు, ఎల్వోసీ వద్దకు ప్రయాణాలు చేయొద్దని పాక్లోని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఒక ట్రావెల్ అడ్వైజరీని జారీచేసింది.
ఇరుదేశాల సరిహద్దుల్లో ప్రయాణించొద్దు..
ఉగ్రవాదం, పౌర అశాంతి, కిడ్నాప్, ఆకస్మిక హింస ముప్పును పేర్కొంటూ జమ్మూకశ్మీర్, భారత్ పాకిస్థాన్ సరిహద్దుల నుంచి 10కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు ప్రయాణించొద్దని యూకే విదేశాంగ కార్యాలయం తన పౌరులకు సూచించింది. సింగపూర్ కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేసింది.