Published On:

IMD: వాతావరణశాఖ అలర్ట్.. వచ్చే నాలుగు రోజులు వర్షాలు

IMD: వాతావరణశాఖ అలర్ట్.. వచ్చే నాలుగు రోజులు వర్షాలు

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడి భగభగలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వేసవి దృష్ట్యా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న నాలుగురోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడతాయని తెలిపింది. ఈమేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

 

తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రాష్ట్రంలో 17 జిల్లాల్లో వర్షప్రభావం ఉంటుందని వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

 

మరోవైపు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెప్పింది. ముఖ్యంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.