CM Revanth Reddy : రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలింది.. సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy : ప్రాజెక్టుల నాణ్యత విషయంలో ఇంజినీర్లు ఎవరి ఒత్తిళ్లకు లొంగవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని జలసౌధ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖలో ఏఈ, జేటీవో పోస్టులకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.
ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే ఆంధ్రప్రదేశ్లో భారీ ప్రాజెక్టులకు ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేశారని చెప్పారు. నెహ్రూ శంకుస్థాపన చేసిన నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులతో మనకు నీళ్లు అందుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 50, 60 ఏళ్ల కింద నిర్మించిన ప్రాజెక్టులే ఈనాటికి నీళ్లు ఇస్తున్నాయని పేర్కొన్నారు. నాగార్జున సాగర్, శ్రీరామ్సాగర్ ఎన్నో వరదలు, ఉపద్రవాలను తట్టుకుని నిలబడ్డాయని వివరించారు.
రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం మూడేళ్లలోనే కూలిందని ఆరోపించారు. కట్టిన మూడేళ్లలోనే కూలిన ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో అదనంగా వెయ్యి ఎకరాలకు కూడా నీరు అందలేదని దుయ్యబట్టారు. కనీసం మట్టి పరీక్షలు కూడా చేయకుండా ప్రాజెక్టు నిర్మించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది అని సీఎం విమర్శించారు. ఎస్ఎస్బీసీ, సీతారామ, దేవాదుల, నెట్టెంపాడు, సమ్మక్క సారక్క ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. గ్రూప్-1 నియామకాలను ఎవరూ అడ్డుకున్నారో ప్రజలకు తెలుసన్నారు. త్వరలోనే గ్రూప్స్ నియామకాలు పూర్తి చేస్తామని హామీనిచ్చారు.