Published On:

Pillalamarri: పిల్లలమర్రిలో అందాల భామలు.. గిరిజనులతో స్టెప్పులు

Pillalamarri: పిల్లలమర్రిలో అందాల భామలు.. గిరిజనులతో స్టెప్పులు

Mahabubnagar: మిస్ వరల్డ్ పోటీలకు విచ్చేసిన అందాల భామలు ఇవాళ పిల్లలమర్రిలో సందడి చేశారు. దాదాపు 700 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పిల్లలమర్రిలో అందాల భామలు కనువిందు చేశారు. కాగా మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన సుందరీమణులలో ఓ బృందం ఇవాళ పిల్లలమర్రికి వచ్చింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ చేరుకున్నారు. తెలంగాణ పండుగుల విశిష్టత సంస్కృతిని ప్రతిబింబించేలా సాంప్రదాయ నృత్యాల మధ్య అందాల భామలకు ఘనస్వాగతం పలికారు.

 

ముందుగా శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడే ఉన్న మ్యూజియం సందర్శించారు. తర్వాత బతుకమ్మ ఆడి అందరినీ ఉత్సాహ పరిచారు. గిరిజన యువతుల బంజారా నృత్యాలు చేయగా వారితో అందాల భామలు కలిశారు. తర్వాత పిల్లలమర్రి వృక్షాన్ని సందర్శించారు. ఆ చెట్టు చరిత్ర, విశిష్టత పెంపకం గురించి అటవీశాఖ అధికారి వారికి వివరాలు తెలిపారు. ఇక నారాయణపేట, గద్వాల చేనేత వస్త్రాలు, హస్తకళలు, కళాకృతుల స్టాల్స్ ను పరిశీలించారు. తర్వాత మొక్కలు నాటారు.

 

మిస్ వరల్డ్ పోటీదారుల్లోని 24 మంది బృందం ఎక్స్ పీరియం ఎకో-టూరిజం పార్క్ ను సందర్శించారు. 250 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎక్స్ పీరియంలో అందాల భామలు సేదతీరారు. అనంతరం అక్కడ జరిగే వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడి నృత్యకారులతో స్టెప్పులు వేశారు. సన్ డౌనర్ పాయింట్, బుద్ధ ఇన్ సైడ్ ట్రీ స్పాట్, రెడ్ టైల్ ఫార్మేషన్ స్పాట్, ఈజిప్షియన్ రాక్ స్పాట్ వీక్షించారు. కాగా మహబూబ్ నగర్ జిల్లాలో అందాల భామల పర్యటనతో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా పోలీసులు పటిష్ట భద్రతను కల్పించారు.