Hyderabad Police: హైదరాబాద్ పోలీసులకు అరుదైన గౌరవం.. దుబాయ్ లో పురస్కారం

Award: హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దుబాయ్ లో జరుగుతున్న పోలీస్ సమ్మిట్ 2025లో హైదరాబాద్ పోలీసులకు విలువైన పురస్కారం దక్కింది. దీంతో రాష్ట్ర పోలీసుశాఖకు అన్నివర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో డ్రగ్స్ నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీచేశారు. కాగా తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని గతంలో పలుమార్లు వివరించారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ అక్రమ రవాణా, డ్రగ్స్ వినియోగం అరికట్టడంలో పోలీసులు చేసిన కృషికిగాను ఎక్సలెన్స్ ఇన్ యాంటీ- నార్కోటిక్స్ విభాగంలో హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ అవార్డును హైదరబాద్ నగర పోలీస్ కమిషనర్ డీజీ సీవీ ఆనంద్ దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ క్లబ్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అందుకున్నారు. కాగా ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా 138 దేశాల నుంచి పలువురు పోలీసు అధికారులు హాజరయ్యారు.
కాగా హైదరాబాద్ కు అవార్డు రావడంపై సీపీ సీవీ ఆనంద్ ఆనందం వ్యక్తం చేశారు. అవార్డు రావడంలో నార్కోటిక్ వింగ్ లోని అధికారులు, సిబ్బంది అంకితభావం, పట్టుదల ఉందని కొనియాడారు. వారి కృషికి ఫలితమే ఈ అవార్డు అన్నారు. ఈ విజయం కేవలం తెలంగాణకు మాత్రమే కాకుండా, మొత్తం భారతదేశ పోలీస్ విభాగానికి గర్వకారణమని తెలిపారు. డ్రగ్స్ నివారణ కోసం హైదరాబాద్ పోలీసులు చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని చెప్పుకొచ్చారు.