India: టర్కీ, అజర్ బైజాన్ కు ఝలక్.. వారితో వ్యాపారాలు బంద్

CAIT: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరిగాయి. దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. అయితే భారత్ జరిపిన దాడులను ప్రపంచ మొత్తం సమర్థిస్తే టర్కీ, అజర్ బైజాన్ దేశాలు మాత్రం పాకిస్తాన్ కు వంత పాడాయి. భారత దాడుల్లో పాకిస్తాన్ లోని అమాయక ప్రజలు చనిపోయారని.. వారికి సంతాపం తెలుపుతున్నట్టు ఇరుదేశాలు ప్రకటించాయి.
పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో భారత్ పైకి దాడులకు పాల్పడింది. దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే పాక్ కు టర్కీ నుంచి డ్రోన్లు, ఆయుధాలు సరఫరా అయినట్టు నిర్ధారణ అయింది. భారత్ పైకి పాక్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైళ్లను భారత్ ధీటుగా కూల్చివేసింది. కూలిపోయిన ఆయుధాల శకలాలపై టర్కీ దేశపు గుర్తులు కనిపించడం విశేషం. మరోవైపు పాకిస్తాన్ మాకు అత్యంత దగ్గరి మిత్రుడని ఆదేశ అధ్యక్షుడు ఇటీవలే ప్రకటించడం గమనార్హం. అలాగే పాకిస్తాన్ కు మద్దతుగా భారత్ ను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్న టర్కీ మీడియా సంస్థలను కూడా భారత్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా టర్కీ, అజర్ బైజాన్ దేశాలకు వెళ్లకుండా ఇప్పటికే పలు ట్రావెల్ ఏజెన్సీలు, టూర్ ఆపరేటర్లు బుకింగ్ ఆపేశాయి. కాగా ఆ దేశాలకు ఫ్లైట్ బుకింగ్స్ ఇప్పటికే 60శాతానికి పైగా తగ్గిపోయాయి. తాజాగా ఈ దేశాలకు మరో దెబ్బ పడింది. పాకిస్తాన్ కు అండగా నిలిచిన కారణంగా టర్కీ, అజర్ బైజాన్ దేశాలతో వ్యాపార సంబంధాలు నిలిపివేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారుల సంఘం నేతలు ఇవాళ ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు దేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఇక నుంచి ఆ రెండు దేశాలకు ఎగుమతులు, దిగుమతులు జరగవని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు.
‘ఇకపై ఇరు దేశాలతో ఎలాంటి వ్యాపారం జరగదు. టర్కీ, అజర్ బైజాన్ లో యాడ్స్, సినిమా షూటింగ్ కూడా జరగకూడదని దేశీయ కంపెనీలు, చిత్ర పరిశ్రమను కోరాం. చాలా కంపెనీలు ఈ దేశాల్లో తమ ఉత్పత్తుల కోసం యాడ్స్ షూట్ చేస్తాయి. వాటిని కూడా చేయవద్దని చెప్పాం. తమ నిర్ణయానికి వ్యతిరేకంగా నడుచుకుంటే వారిని కూడా బహిష్కరిస్తాం’ అని ఖండేల్వాల్ స్పష్టం చేశారు. తక్షణమే బహిష్కరణ నిర్ణయం అమలులోకి వస్తుందని చెప్పారు.