Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్!

Rains in Telugu States two days for orange alert: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతుండడంతో ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావం ఉండనుంది. అంతేకాకుండా బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది.
ఇప్పటికే తెలంగాణ, ఏపీలో రాత్రి నుంచి వర్షం పడుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం కురుస్తుండగా.. విజయవాడలో ఉరుములతో కూడిన కుండపోత వర్షం పడతోంది. ఇక భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
అలాగే, హైదరాబాద్లో రాత్రి వర్షం దంచికొట్టింది. సికింద్రాబాద్, జూబిహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, బేగంపేట్, మలక్ పేట, సైదాబాద్, ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలకు రోడ్లు నిండిపోయాయి. దీంతో ట్రాఫిక అంతరాయం ఏర్పడింది.
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని సూచనలు చేసింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం పడుతుందని హెచ్చరించింది.
ఇందులో భాగంగానే పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణ పేట, మెదక్, గద్వాల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, నిర్మల్, వికారాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.