Published On:

Pushkaralu: సరస్వతి పుష్కరాలు షురూ.. సీఎం రేవంత్ పుణ్యస్నానం

Pushkaralu: సరస్వతి పుష్కరాలు షురూ.. సీఎం రేవంత్ పుణ్యస్నానం

Kaleshwaram: తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా త్రివేణి సంగమంలో సీఎం రేవంత్ రెడ్డి పుణ్యస్నానం ఆచరించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి జ్ఞాన సరస్వతీ పుష్కర ఘాట్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకు ముందు జ్ఞాన సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేశారు.

 

సరస్వతి నది పుష్కరాలు నేటి నుంచి ఈనెల 26 వరకు 12 రోజులపాటు జరగనున్నాయి. దీంతో కాళేశ్వరంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. ఇవాళ ఉదయం తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజి పూజలతో పుష్కర స్నానాలు ప్రారంభమయ్యాయి. కాగా కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత నదులతో పాటు సరస్వతి నది అంతర్ వాహిణినిగా ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే కాళేశ్వర క్షేత్రానికి త్రివేణి సంగమం అని పేరు వచ్చింది. ఇక భక్తులు పుష్కర స్నానాలు చేసిన అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.

 

భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పుష్కరాలకు రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇక భక్తుల వసతి కోసం ప్రభుత్వం టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. అలాగే భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేసింది. స్నానాలు చేసేందుకు షవర్లను కూడా పెట్టింది. భక్తుల కోసం ప్రసాద ప్యాకెట్లను సిద్ధం చేస్తోంది.