Published On:

Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం.. ముంబై క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం

Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం.. ముంబై క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం

Cricket: టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. భారత క్రికెట్ జట్టుకు ఆయన చేసిన సేవలకు ముంబై క్రికెట్ అసోసియేషన్ తగిన విధంగా సత్కారం చేసింది. వాంఖడే స్టేడియంలోని ఓ స్టాండ్ కు రోహిత్ శర్మ పేరు పెట్టారు. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు వాంఖడే స్టేడియంలో కొత్తగా పేరు మార్చబడిన మూడు స్టాండ్ లను ప్రారంభించారు. ఈ మేరకు జరిగిన వేడుకలకు రోహిత్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ కు రోహిత్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు.

 

“ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు. చిన్నప్పుడు నేను ముంబై, ఇండియా తరపున క్రికెట్ ఆడాలని అనుకున్నాను. కానీ వాంఖడే స్టేడియంలో నా స్టాండ్ ఉంటుందని కలలో కూడా అనుకోలేదు” అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా వాంఖడే స్టేడియంలోని దివేచా పెవిలియన్ లెవల్ 3 పేరును రోహిత్ శర్మ స్టాండ్ గా మార్చి హిట్ మ్యాన్ కు అపురూపమైన జ్ఞాపకాన్ని ఇచ్చారు.

 

అయితే వాంఖడే స్టేడియంలో ఇప్పటికే సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, విజయ్ మర్చంట్ వంటి దిగ్గజ ఆటగాళ్ల పేర్లను కొన్ని స్టాండ్ లకు పెట్టారు. తాజాగా రోహిత్ శర్మ వారి సరసన చేరారు. అలాగే గ్రాండ్ స్టాండ్ లెవల్ 3 కి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ పేరును, గ్రాండ్ స్టాండ్ లెవల్ 4 ను భారత జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ పేరును పెట్టారు.