Published On:

Passports: గుడ్ న్యూస్.. త్వరలోనే చిప్ బేస్డ్ పాస్ పోర్ట్ జారీ

Passports: గుడ్ న్యూస్.. త్వరలోనే చిప్ బేస్డ్ పాస్ పోర్ట్ జారీ

Telangana: విదేశాలకు వెళ్లాలంటే ఏం కావాలి అంటే.. ఠక్కున పాస్ పోర్ట్, వీసా కావాలి అని చెప్తుంటారు. అయితే ఇప్పటి వరకు సాధారణ పాస్ పోర్ట్ జారీ చేస్తున్న పాస్ పోర్ట్ కార్యాలయాలు ఇక నుంచి అధునాతన, చిప్ ఆధారిత పాస్ పోర్ట్ లు ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. హైదరాబాద్ లో ‘ఈ చిప్ ఆధారిత పాస్ పోర్ట్’ జారీ చేసేందుకు తెలంగాణ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది.

 

కాగా విదేశాంగ మంత్రిత్వశాఖ సూచనలతో హైదరాబాద్ లో ఈ- చిప్ పాస్ పోర్ట్ జారీని ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 12 నగరాల్లో చేపట్టనున్న పైలట్ ప్రాజెక్టులో హైదరాబాద్ ను కూడా విదేశాంగ మంత్రిత్వశాఖ ఎంపిక చేసింది. చెన్నై, నాగపూర్, భువనేశ్వర్, జమ్ము, గోవా, సిమ్లా, రాయపూర్, అమృత్ సర్, జైపూర్, సూరత్, రాంచీలో కూడా ఈ- చిప్ పాస్ పోర్ట్ జారీని ప్రారంభించనున్నారు.

 

కొత్త చిప్ పాస్ పోర్ట్ ప్రస్తుత పాస్ పోర్ట్ లాగే పోలి ఉంటుంది. అయితే అత్యంత అధునాతన భద్రతా వ్యవస్థతో కూడిన చిప్ కలిగి ఉంటుంది. దరఖాస్తుదారుడి పూర్తి వివరాలు ఈ చిప్ లో ఉంటాయి. బయోమెట్రిక్ డేటా, డిజిటల్ సైన్ తో సహా పలు ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. దీంతో ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికుడి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే విదేశాల్లోని అన్ని రాయబార కార్యాలయాలు ఈ- పాస్ పోర్ట్ ప్రాజెక్టుతో లింక్ అవుతాయి. అమెరికా, బ్రిటన్ ఎంబసీలో ఇప్పటికే ఈ విధానం అమలవుతోంది.

 

ఈ-చిప్ పాస్ పోర్ట్ ను నాసిక్ లోని ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ లో తయారు చేస్తారు. ఆర్ఎఫ్ఐడీ చిప్, యాంటెనా కవర్ లో దాగి ఉంటాయి. ఈ- చిప్ పాస్ పోర్టును ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండదు. ఒకవేళ ఎవరైనా ట్యాంపరింగ్ చేయాలని చూస్తే పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి అలర్ట్ వెళ్తుంది. కాగా సాధారణ పాస్ పోర్ట్ జారీ చేసేందుకు 10 రోజులు టైం పట్టేది. కానీ చిప్ ఆధారిత పాస్ పోర్ట్ 7 రోజుల్లో జారీ అవుతుంది. అయితే ఇప్పటివరకు జారీ అయిన పాస్ పోర్టులు కూడా కొనసాగుతాయని పాస్ పోర్ట్ కార్యాలయం చెప్పింది. ఒకవేళ ఈ- చిప్ ఆధారిత పాస్ పోర్ట్ తీసుకుంటే ఆటోమేటిక్ గా పాత పాస్ పోర్ట్ రద్దవుతుంది.