India vs Pakistan: నేడే ఉత్కంఠ పోరు.. భారత్ వర్సెస్ పాకిస్థాన్

India vs Pakistan Match in ICC Champions Trophy 2025: భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్కు ఇరు దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ ఉంటుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అనగానే క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ ఉంటుంది. ఈ దాయాదుల పోరు కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. అలాంటి మ్యాచ్ మరి కాసేపట్లో జరగనుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ప్రారంభం కానుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఊపుమీదుండగా.. పాకిస్థాన్ ఒత్తిడిలో కనిపిస్తుంది. భారత్ జట్టు బంగ్లాదేశ్ను ఓడించగా.. పాకిస్తాన్ న్యూజిలాండ్ చేతిలో ఓటమి చెందింది. మరో వైపు భారత్ జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. ఓపెనర్ గిల్ మంచి ఫామ్లో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్పై సెంచరీ చేయగా.. రోహిత్ కూడా ఫామ్ కొనసాగిస్తున్నాడు. విరాట్ కోహ్లి, శ్రేయస్ చెలరేగితే భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కేఎల్ రాహుల్ తన బ్యాటింగ్తో ఆకట్టుకోగా.. అక్షర్ పటేల్, హార్దిక్, జడేజాలు కూడా ఆల్ రౌండర్ ప్రదర్శన కనబరుస్తున్నారు. బౌలింగ్ విషయంలో షమీ మళ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు.
పాకిస్థాన్ జట్టు బలంగా కనిపించినా.. తొలి మ్యాచ్లో పేలవ ప్రదర్శన కనబర్చింది. స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ హాఫ్ సెంచరీ చేసినప్పటికీ విమర్శలు వచ్చాయి. లక్ష్యం భారీగా ఉండగా.. చాలా నెమ్మదిగా ఆడడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. అయితే భారత్తో కెప్టెన్ రిజ్వాన్తో పాటు ఖుష్ దిల్ షా, అజామ్, సల్మాన్ ఆఘాలు ఆడితే గెలిచే అవకాశం ఉంది. బౌలర్లలో షహీన్ ఆఫ్రిది, హారిస్ రవూఫ్, నషీబ్ షా, అబ్రార్ అహ్మద్లు బలంగా కనిపిస్తున్నారు. భారత్పై షహీన్ ఆఫ్రిదికి మంచి రికార్డు కూడా ఉంది.
ఇదిలా ఉండగా, భారత్తో జరిగే మ్యాచ్కు తమ జట్టు పూర్తిగా సిద్ధంగా ఉందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహ్సిన నఖ్వీ అన్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా జట్టు ఆటగాళ్లను కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మా టీమ్ చాలా బాగుందని చెప్పారు. అంతేకాకుండా మా టీమ్ గెలిచినా ఓడినా మేము అండగా ఉంటామని స్పష్టం చేశారు.