Social Media: పాకిస్తాన్ కు అనుకూలంగా పోస్ట్.. మెడికోపై కేసు

Karnataka: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దాడులకు ప్రతీకార చర్యగా పాకిస్తాన్ డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులకు పాల్పడుతుంది. వాటిని భారత్ డిఫెన్సీవ్ సిస్టమ్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఈనేపథ్యంలోనే భారత్- పాక్ యుద్ధానికి సంబంధించి అలజడులు చెలరేగేలా సోషల్ మీడియాలో ఎవరూ పోస్టులు పెట్టొద్దని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా అలా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఈనేపథ్యంలోనే కర్నాటకలోని ఓ మెడికల్ స్టూడెంట్ పాకిస్తాన్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు ఇవాళ తెలిపారు. కాగా విద్యార్థి చేసిన పోస్టుపై భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోస్ట్ చేసిన విద్యార్థి ప్రస్తుతం ముంబైలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ కావడంతో ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయపుర పోలీసులు వెల్లడించారు. కాగా విజయపుర అల్ అమీన్ మెడికల్ కాలేజీ విద్యార్థి తసౌద్ ఫరూకీ షేక్ అనే విద్యార్థి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు గుర్తించారు.
ఉద్రిక్తతల నేపథ్యంలో ‘నా పాకిస్తానీ స్నేహితులకు.. ఆజాద్ కాశ్మీర్, భారత్ లోని కాశ్మీర్ ప్రజలు సైనిక, ప్రభుత్వ స్థావరాలకు దగ్గరగా వెళ్లొద్దు. మీరు 200 కిలోమీటర్ల లోపు సరిహద్దుకు దగ్గరగా ఉంటే వెంటనే దూరంగా వెళ్లిపోండి. అల్లా మనందరినీ భారత్ నుంచి రక్షించుగాక. అమీన్’ అంటూ పాకిస్తాన్ జెండాను షేర్ చేసింది. అలాగే వాట్సప్ లోనూ స్టేటస్ పెట్టింది.
అయితే పోలీసులు కేసు నమోదు చేయడంపై విద్యార్థి క్షమాపణలు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై ‘తన చర్యల కారణంగా బాధపడిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. తాను భారతీయురాలినని.. నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. ఇది నా మాతృ భూమి. నేను భారత్ లోనే పుట్టాను. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవివేకం. మళ్లీ ఇలాంటి పనులు చేయను. అందరినీ క్షమాపణలు కోరుతున్నా. జై హింద్’ అంటూ పోస్ట్ పెట్టిందని వెల్లడించారు.