Miss World Contest: మిస్ వరల్డ్ పోటీలకు భారీ భద్రత.. రేపే ఓపెనింగ్ ప్రోగ్రాం

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా ఈవెంట్ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలకు చెందిన అందాల భామలు పోటీలో పాల్గొనేందుకు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది.
మరోవైపు మిస్ వరల్డ్ పోటీలకు హాజరైన అతిథులకు, పోటీదారులకు నగరంలోని పలు హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. అలాగే ఆయా హోటళ్ల వద్ద భారీ భద్రత కల్పించారు. పోటీలో పాల్గొనే అందాల భామలు, అతిథులకు తెలంగాణ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయలను పరిచయం చేయనున్నారు. అలాగే రాష్ట్రంలోని పర్యటాక, చారిత్రక ప్రదేశాలను చూపించనున్నారు. రాష్ట్రానికి చెందిన వంటకాలను కూడా రుచి చూపించనున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం తరపున మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేవారికి విందు ఇవ్వనున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ ఉన్నందున.. టూరిజం శాఖ పాస్ లు ఉన్న వారికే అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. స్టేడియం చుట్టుపక్కల 300- 350 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నామన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు. భద్రతకు సంబంధించి తెలంగాణ డీజీపీ, సైబరాబాద్ సీపీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొనేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని చెప్పారు. అలాగే పోటీదారులు, అతిథులు పర్యటించే ప్రదేశాల్లోనూ భద్రతను ఏర్పాటు చేస్తామని వివరించారు. కాగా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈవెంట్ గురించి ఇప్పటికే పలుమార్లు సమీక్ష నిర్వహించారు.