India Pakistan War : 400 టర్కీ డ్రోన్లతో పాక్ దాడి : కర్నల్ సోఫియా ఖురేషీ

Pakistan attacks with 400 drones : ఇండియాలోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యం చేసుకొని పాక్ గురువారం రాత్రి డ్రోన్ దాడులకు తెలబడింది. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 36 ప్రాంతాలను టార్గెట్ చేసుకొని 300 నుంచి 400 డ్రోన్లతో దాడులకు పాల్పడినట్లు భారత సైన్యం తెలిపింది. పాకిస్థాన్ తన పౌర విమానాలను రక్షణ కవచాలుగా వాడుకుంటోందని వెల్లడించింది.
నిఘా సమాచార సేకరణే లక్ష్యంగా దాడులు..
ఆపరేషన్ సిందూర్కు సంబంధించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్తో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నిఘా సమాచార సేకరణే లక్ష్యంగా దాడులు జరిగాయని తెలిపారు. తుర్కియేకు చెందిన ‘ఆసిస్గార్డ్ సోంగర్’ డ్రోన్లను ప్రయోగించినట్లు తెలిపారు.
అనేక డ్రోన్లను కూల్చేశాం..
గురువారం రాత్రి రెచ్చగొట్టే చర్యలకు పాక్ దిగిందని తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి ఉల్లంఘనకు పాల్పడుతూ దాడులకు పాల్పడిందని పేర్కొన్నారు. ఇండియా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసిందని స్పష్టం చేశారు. పాక్ నుంచి 300 నుంచి 400 డ్రోన్లు వచ్చాయని, దీంతో అనేక డ్రోన్లను కూల్చేశామని వెల్లడించారు. పంజాబ్ సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్నామని వివరించారు. దాడుల్లో అనేకమంది గాయపడ్డారని తెలిపారు. పాకిస్థాన్ దాడులను భారత వాయుసేన సమర్థంగా అడ్డుకుందని చెప్పారు. ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా దాడులు చేస్తోందని, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.
వాయుసేన సంయమనంగా వ్యవహరించింది..
పాక్ డ్రోన్, క్షిపణి దాడులు మొదలుపెట్టినప్పటికీ అక్కడి పౌర విమానాలకు గగనతలాన్ని మూసివేయలేదని వారు పేర్కొన్నారు. కరాచీ, లాహోర్ మధ్య విమాన సర్వీసులు నడుస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. తమ దాడులకు భారత్ నుంచి ప్రతిస్పందన ఉంటుందని తెలిసి పౌర విమానాలను పాక్ రక్షణ కవచంగా వాడుకుంటోందని చెప్పారు. అంతర్జాతీయ ఫ్లైట్లను దృష్టిలో ఉంచుకొని భారత వాయుసేన పూర్తి సంయమనంగా వ్యవహరించిందని వెల్లడించారు.