Published On:

China: భారత్- పాకిస్తాన్ యుద్ధం.. మేం మాట్లడతామంటున్న చైనా

China: భారత్- పాకిస్తాన్ యుద్ధం.. మేం మాట్లడతామంటున్న చైనా

India- Pak War: పహల్గామ్ దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు అమాయకపు పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా సైనిక చర్యకు దిగింది. దాడుల్లో 100 మందికిపైగా ముష్కరులను హతం చేసింది.

 

కాగా భారత్ జరిపిన దాడులపై పాకిస్తాన్ గుర్రుగా ఉంది. దీంతో భారత్ పై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు పాల్పడుతోంది. ఈ దాడులను భారత రక్షణ వ్యవస్థ ధీటుగా ఎదుర్కొంటోంది. అలాగే పాకిస్తాన్ లోని పలు ఏరియాల్లో డ్రోన్లను ప్రయోగించింది. ఇప్పటివరకు పాకిస్తాన్ కు చెందిన 50 డ్రోన్లను ఇండియా ధ్వంసం చేసింది. అలాగే మూడు యుద్ధవిమానాలను నేలకూల్చింది. అలాగే సరిహద్దు వెంబడి పాకిస్తాన్ కాల్పులకు తెగబడి 16 మంది అమాయకపు ప్రజలను బలితీసుకుంది. అందుకు భారత సైనిక దళాలు తగిన విధంగా బుద్ధి చెప్తున్నాయి.

 

అయితే భారత్- పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్దవాతావరణంతో చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆశాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. టెర్రరిజానికి తాము వ్యతిరేకమని అన్నారు. పొరుగు దేశాల్లో శాంతి, సుస్థిరత అవసరమని చెప్పారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకుగాను అంతర్జాతీయంగా నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇరుదేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.