Punjab Assembly : పాకిస్థాన్లో ఉన్నట్టుగా ఉంది.. సొంత ప్రభుత్వంపై పంజాబ్ ఎమ్మెల్యేల విమర్శలు

Punjab Assembly : పంజాబ్ ప్రభుత్వానికి సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి నిరసన సెగ తగిలింది. ఇవాళ శాసన సభ సాక్షిగా ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు సర్కారు పనితీరుపై అసంతృప్తి గళం వినిపించారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందని విమర్శించారు. తన నియోజకవర్గంలో ప్రజలు పాకిస్థాన్లో ఉన్నట్టుగా ఫీలవుతున్నారని మోగా జిల్లాలోని ధరమ్కోట్ నియోజకవర్గ శాసన సభ్యుడు దేవిందర్ జీత్ సింగ్ వ్యాఖ్యానించారు.
అప్గ్రేడ్ చేయడంలేదు..
మోగా జిల్లాలోని ధరమ్కోట్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధునీకరణకు సంబంధించి ఏదైనా ప్రతిపాదన ఉందా..? అని దేవిందర్జీత్ సింగ్ శాసన సభలో లేవనెత్తారు. దీనికి ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ లేదని సమాధానం ఇచ్చారు. ధరమ్కోట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సబ్ డివిజనల్ ఆసుపత్రిగా మార్చే ప్రతిపాదన సర్కార్ వద్దని లేదని స్పష్టం చేశారు. కోట్ ఇసే ఖాన్లోని కమ్యూనిటీ హెల్త్ కేంద్రానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ధరమ్కోట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నందున అప్గ్రేడ్ చేయడం లేదని వివరణ ఇచ్చారు.
ప్రభుత్వ తీరుపై అసంతృప్తి గళం..
ధరమ్కోట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ట్రామా కేర్ కేంద్రాన్ని ప్రారంభించాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని మంత్రి తేల్చి చెప్పారు. రాష్ట్రంలో జలంధర్, పఠాన్కోట్, ఖన్నా, ఫిరోజ్పూర్, ఫజిల్కాల్లో ట్రామా కేర్ కేంద్రాలు ఉన్నాయన్నారు. దీంతో మోగా జిల్లాపైన, తన నియోజకవర్గంపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని ఎమ్మెల్యే దేవిందర్జీత్ సింగ్ వ్యాఖ్యానించారు. షుట్రానా నియోజకవర్గ ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ బాజీగర్ ఆరోగ్య రంగంలో ప్రభుత్వ తీరుపై అసంతృప్తి గళం వినిపించారు.