Tejashwi Yadav : కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : ప్రధాని మోదీకి తేజస్వీ యాదవ్ లేఖ

Tejashwi Yadav welcomes the announcement made by the Center : వచ్చే జనాభా లెక్కల్లో కులగణనను చేర్చుతామని కేంద్రం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కులగణన దేశం సమానత్వం వైపు సాగే ప్రయాణంలో మంచి మార్పును తీసుకొచ్చే క్షణమని లేఖలో పేర్కొన్నారు. కులగణన కేవంల డేటా కాదని, అనేక మంది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని రాసుకొచ్చారు.
సర్వేను కేంద్రం జాగ్రత్తగా నిర్వహించాలి..
కేంద్ర ప్రభుత్వం కులగణన సర్వేను పకడ్బందీగా చేపట్టాలని తేజస్వి యాదవ్ సూచించారు. కులగణన ఎప్పటికీ ముగిసిపోదని చెప్పారు. సామాజిక న్యాయం వైపు చేసే సుదీర్ఘ ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కులగణన నిర్వహించిన అనంతరం ఆ డేటాను వ్యవస్థాగత సంస్కరణలు చేయడానికి ఉపయోగిస్తారా లేక మునుపటి కమిషన్ల నివేదికల మాదిరిగానే ఉంచుతారా? అని మోదీని ప్రశ్నించారు. జనాభా లెక్కలు, కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వానికి బీహార్ సహకారం ఉంటుందని హామీనిచ్చారు.
కేంద్రం నిర్ణయం మంచిదే..
ప్రతిపక్షాలు ఎన్నో ఏళ్లుగా కులగణన కోసం డిమాండ్ చేస్తున్నా ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దేశ ప్రజల్లో విభజనలు సృష్టించడం సరైన చర్య కాదని తన లేఖలో పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని గుర్తుచేశారు. ఆలస్యమైనా కేంద్రం సరైన నిర్ణయం తీసుకుందని సంతోషం వ్యక్తం చేశారు. దీంతో సమాజంలో చాలాకాలంగా అణచివేతకు గురవుతున్న ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జనగణన డేటా సామాజిక రక్షణ, రిజర్వేషన్ విధానాల సమగ్ర సమీక్షకు ఉపయోగపడేలా ఉండాలన్నారు.
పారదర్శకంగా లెక్కలు తీయాలి..
కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై ఏకపక్ష పరిమితిని కూడా పునఃపరిశీలించాలని తేజస్వి కోరారు. జనాభా లెక్కల్లో కులగణనను నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కులగణన అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తోందన్నారు. అయినప్పటికీ విపక్షాలు అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు సర్వేల పేరుతో కులగణన నిర్వహించాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల ప్రక్రియలో కులగణనను చేర్చి పారదర్శకంగా లెక్కలు తీయాలనేదే ప్రధాని మోదీ సర్కారు సంకల్పమన్నారు.