Revanth Reddy : చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రతిపాదన

Revanth Reddy : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై యూనివర్సిటీలు, సంస్థలు ఉంటే పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. సమస్యను పరిష్కరించేందుకే తెలంగాణలోని యూనివర్సిటీలు, సంస్థలకు రాష్ట్రానికి సంబంధించిన పేర్లు పెడుతున్నామని చెప్పారు. ఇవాళ శాసనసభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, తెలుగు వర్సిటీ పేరు మార్పు తదితర బిల్లులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం మాట్లాడారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రానికి ప్రతిపాదిస్తున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో అనేక యూనివర్సిటీలకు పేర్లు మార్చుకున్నామని చెప్పారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పీవీ నరసింహారావు, కాళోజీ నారాయణరావు పేర్లు పెట్టుకున్నామని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. అదే ఒరవడిలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్రెడ్డి పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ సమాజానికి సురవరం ఎంతో సేవ చేశారని కొనియాడారు. గోల్కొండ పత్రికను సురవరం ప్రతాప్రెడ్డి నడిపారన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర సురవరం ప్రతాప్రెడ్డికే దక్కిందన్నారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదని సీఎం స్పష్టం చేశారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పట్ల తమ ప్రభుత్వానికి గౌరవం ఉందన్నారు. ఆర్యవైశ్య సమాజం పట్ల ప్రభుత్వానికి అపారమైన నమ్మకం, విశ్వాసం ఉందని చెప్పారు. కులం, మతం పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం సరికాదన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్కు లేఖ రాస్తానని చెప్పారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తుచేసుకుందామని పునర్ఘటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకురావాలని కిషన్రెడ్డి, బండి సంజయ్కి విజ్ఞప్తి చేశారు.
నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరు
బల్కంపేట్లో నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరు పెడతామని సీఎం స్పష్టం చేశారు. ఆయన సుదీర్ఘ అనుభవం గల నేత అని కొనియాడారు. గవర్నర్గా, ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలందించారని గుర్తుచేశారు. నేచర్క్యూర్ ఆసుపత్రి సమీపంలో రోశయ్య విగ్రహం నెలకొల్పి అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు.
పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పేరు మార్పునకు ఆమోదం..
పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పేరు మార్పు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. సురవరం ప్రతాప్రెడ్డి తెలుగు యూనివర్సిటీగా పేరు మార్చారు.