Published On:

IPL 2025: ఐపీఎల్‌ రీస్టార్ట్.. ఆర్సీబీతో కేకేఆర్ కీలక మ్యాచ్.. ఓడితే!

IPL 2025: ఐపీఎల్‌ రీస్టార్ట్.. ఆర్సీబీతో కేకేఆర్ కీలక మ్యాచ్.. ఓడితే!

IPL 2025 Re Start First match Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders: ఐపీఎల్ లవర్స్‌కు పండగే. గత 10 రోజులుగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఐపీఎల్ 2025 నేటినుంచి మళ్లీ పున:ప్రారంభం కానుంది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఐపీఎల్ మ్యాచ్‌లను మధ్యలో నిలిపివేసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య పరిస్థితులు చక్కదిద్దుకోవడంతో ఐపీఎల్ రీ షెడ్యూల్‌ను ప్రకటించింది. మిగతా 17 లీగ్ మ్యాచ్‌ల వేదికలను విడుదల చేసింది. ఇందులో భాగంగానే నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తలపడనుంది.

 

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు ఆర్సీబీతో కేకేఆర్ కీలక మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో బెంగళూరు 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. కోల్‌కతా 11 పాయింట్లతో ఆరోస్థానంలో ఉంది. ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు ఆడిన 11మ్యాచ్‌ల్లో మూడింట ఓడి 8 మ్యాచ్‌లు గెలిచి మంచి ఫామ్‌లో ఉంది. ఇక, కోల్‌కతా జట్టు 12 మ్యాచ్‌ల్లో 5 మాత్రమే గెలిచింది. మిగతా 6 మ్యాచ్‌ల్లో ఓటమి చెందగా.. ఒక్క మ్యాచ్ రద్దు అయింది.

 

అయితే ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ కైవసం చేసుకోవాలని ఆర్సీబీ భావిస్తుండగా.. కేకేఆర్ ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలని చూస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడితే కేకేఆర్ ఫ్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.

 

ఇక, ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంది. ఆక్యూవెదర్ సమాచారం ప్రకారం.. సాయంత్రం 5 గంటల తర్వాత బెంగళూరులో భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయని చెప్పింది. ఈ మేరకు దాదాపు 58 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అంతేకాకుండా వర్షం పడిన తర్వాత మరో 3 గంటల్లో తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కాగా, ఈ స్టేడియంలో బెస్ట్ డ్రెయినేజీ వ్యవస్థ ఉండడంతో వర్షం పడి తగ్గితే మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.