Guntur : గుంటూరు మేయర్ రాజీనామా

Guntur : గుంటూరు మేయర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాకు సంబంధించిన పలు కారణాలు వెల్లడిస్తూ జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. మేయర్కు ఉండాల్సిన ప్రోటోకాల్ కూడా తొలగించారని, స్టాండింగ్ కమిటీ సమావేశంపై సమాచారం ఇవ్వలేదని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇలాంటి అవమానాలు ఎప్పుడూ తనకు జరగలేదని, ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని మండిపడ్డారు. తన అనుమతి లేకుండా స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు..
వరద సాయం నిధులపై పరస్పర ఫిర్యాదులు..
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉండగా, 2021లో మనోహర్ నాయుడు గుంటూరు మేయర్గా ఎన్నికయ్యారు. కొన్నాళ్లుగా మేయర్, కమిషనర్ పులి శ్రీనివాసులుకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. బుడమేరు వరద సాయం నిధులను దుర్వినియోగం చేశారని ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు చేసుకునేంత వరకూ పరిస్థితి వెళ్లింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ గైర్హాజరు కావడంతో ఇద్దరికీ ఏమాత్రం పడటం లేదని నగర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన గుంటూరు మున్సిపల్ ఎన్నికల్లో 57 స్థానాలకు 48 స్థానాల్లో వైసీపీ కార్పొరేటర్లు, 9 మంది టీడీపీ కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. 2024లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు సిటీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. 20 మంది వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరారు. ఈ పరిణామంతో గుంటూరులో టీడీపీ పార్టీ బలం పుంజుకుంది.