Pawan Kalyan : పాకిస్థాన్కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోండి.. పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

Pawan Kalyan donates Rs.50 lakhs : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. జమ్ముకాశ్మీర్లోని పవాల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లాకు చెందిన సోమిశెట్టి మధుసూదన్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సోమిశెట్టి కుటుంబానికి పవన్ జనసేన పార్టీ తరఫున రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. అతడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. మంగళవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో నిర్వహించిన కార్యక్రమంలో పహల్గాం అమరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పవన్ పాల్గొని సోమిశెట్టి చిత్రపటానికి పూలమల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
దేశంలో ఉంటూ పాకిస్థాన్ను ప్రేమిస్తామని అంటున్నారని, ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకలు, కొందరు ఎమ్మెల్సీలు ఉన్నట్లు ఉన్నారని తెలిపారు. పాకిస్థాన్పై ప్రేమ ఉంటే ఇండియాను వదిలి అక్కడికి వెళ్లిపోవాలని సూచించారు. జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉందని, కానీ మా పార్టీ విధానం జాతీయ వాదమని పవన్ స్పష్టం చేశారు.
మత ప్రాతిపదికన హత్యలు అంగీకరించబోం..
మత ప్రాతిపదికన హత్యలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని పవన్ స్పష్టం చేశారు. తప్పులు చేసిన వారిని రక్షిస్తూ వైట్వాష్ చేయొద్దని అన్నారు. పాకిస్థాన్ జనాభాకు సమానంగా ఇండియాలో ముస్లింలు ఉన్నారని, కానీ, దేశంలో మత వివక్షకు చోటులేదన్నారు. హిందువులకు ఉన్నది ఒకటే దేశం అన్నారు. ఇక్కడ చంపేస్తే ఎక్కడికి పోవాలి..? అని ప్రశ్నించారు. క్లిష్ట సమయంలో దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చిందని కొనియాడారు. ఉగ్రవాద నిర్మూలనపై రాజకీయాల కంటే దేశ భద్రత ముందు ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఓట్ల కోసం కాదు.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశ సరిహద్దులను కాపాడుకోవాలని సూచించారు. ఉగ్రవాదాలను పూర్తిగా నాశనం చేయాలని పవన్ పిలుపునిచ్చారు.
బెంగళూరులో స్థిరపడిన సోమిశెట్టి..
నెల్లూరు జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మధుసూదన్ బెంగళూరులో స్థిరపడ్డారు. ఈ నెల 22న పహల్గాంలో తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లగా, ఉగ్రవాదులు పొట్టన బెట్టుకున్నారు. సోమిశెట్టికి భార్య కామాక్షి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు మేధ, కుమారుడు దత్తు ఉన్నారు. ఆయన మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.