Pawan Kalyan : పిఠాపురం అభివృద్ధిపై ఫోకస్… పవన్ కల్యాణ్ రివ్యూ

Pawan Kalyan : పిఠాపురం అభివృద్ధిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇక నుంచి వరుసగా సమీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు, పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో జరుగుతున్న అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షలో కీలక సూచనలు చేశారు. నియోజకవర్గ పరిధిలో నాలుగు పోలీస్ స్టేషన్లలో ఉన్న పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని ఆదేశించారు. అవినీతికి పాల్పడుతున్న పోలీసు అధికారుల వల్లే పోలీస్ శాఖ చులకన అవుతోందని చెప్పారు. ప్రతివారం పిఠాపురం అభివృద్ధిపై సమీక్ష చేస్తానని స్పష్టం చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి..
అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పురోగతిని పరిశీలించాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎండాకాలంలో నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండకూడదని చెప్పారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల వద్ద తనిఖీలు చేయాలన్నారు. అమృత్ 2.0 ద్వారా పిఠాపురం పట్టణంలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పిఠాపురం, ఉప్పాడ రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినట్లు తెలిపారు. రూ.59.7 కోట్లు నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. ఉపాధిహామీ పథకంలో రూ.40.2 కోట్లతో 444 రోడ్డు పనులు చేపట్టామన్నారు. 431 గోకులాలు నియోజకవర్గానికి ఇచ్చినట్లు తెలిపారు. పిఠాపురంలో ప్రభుత్వ ఆసుపత్రిని సీహెచ్సీ నుంచి ఏరియా ఆసుపత్రి స్థాయికి పెంచినట్లు గుర్తుచేశారు. అందుకు అనుగుణంగా రూ.38.32 కోట్లు నిధులు వచ్చాయని సమీక్ష సమావేశంలో వెల్లడించారు.