AP CM Chandrababu : ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉంటారు : సీఎం చంద్రబాబు

AP CM Chandrababu : ఉమ్మడి రాష్ర్టంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో 14 నెలల్లో హైటెక్ సిటీ పూర్తి చేసినట్లు చంద్రబాబు తెలిపారు. భవిష్యత్ అంతా ఐటీదేనని అప్పట్లో తాను తల్లిదండ్రులకు పిలుపునిచ్చినట్లు చెప్పారు. స్టార్టప్ కంపెనీల కోసం వి-లాంచ్ పాడ్ 2025ను చంద్రబాబు ఆవిష్కరించారు. అమరావతిలోని విట్ వర్సిటీలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉంటారన్నారు. అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారని తెలిపారు.
ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలి..
మే 2న ప్రధాని మోదీ అమరావతికి వస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతోందని చెప్పారు. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేసినట్లు తెలిపారు. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడు కలెక్టర్ ఉద్యోగానికంటే ఐటీ ఉద్యోగానికే ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పారు. విట్ అమరావతిలో 95 శాతం ప్లేస్మెంట్లు వస్తున్నాయని తెలిపారు. సిలికాన్ వ్యాలీలో కంపెనీల సీఈవోలంతా తెలుగోళ్లు, భారతీయులే ఉన్నారని చెప్పారు. తీవ్రవాదం సమస్యలు ఇండియాను ఏమీ చేయలేవన్నారు.
అమరావతి రాష్ట్రానికి ఆత్మ వంటిది..
అమరావతి అందరిదని, ఏపీకి ఆత్మ వంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కూటమి నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. రాజధాని పునఃనిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరి లభించిందని చెప్పారు. సభకు తరలివచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకూడదని తెలిపారు. అమరావతి రాజధాని తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రాజధాని నిర్మాణంలో రైతులను భాగస్వాములను చేస్తున్నట్లు వివరించారు.
వ్యతిరేక శక్తుల కుట్రలు తిప్పికొట్టాలి..
ఎమ్మెల్యేలు, మంత్రులు బాధ్యత తీసుకొని వ్యతిరేక శక్తుల కుట్రలు తిప్పికొట్టాలన్నారు. త్వరలోనే 42 నియోజకవర్గాల్లో ఇండస్ట్రీయల్ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుడతామన్నారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతామన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.