Nara Lokesh : విద్యార్థులకు దండం పెట్టి, గుంజీలు తీసిన హెచ్ఎం.. అసలు ఏమి జరిగిందంటే?

Nara Lokesh : ఏపీలోని విజయనగరం జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు స్టేజ్ పైనుంచి సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీసి క్షమాపణలు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలం పెంట జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు చింత రమణ విద్యార్థుల విద్యా పురోగతి అంతంత మాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని, విద్యార్థులను దండించకుండా గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అందరూ కలిసి పనిచేసి ప్రోత్సాహం అందిస్తే ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారని, వారిని దండించకుండా అర్థం చేసుకునేలా స్వీయక్రమశిక్షణ చర్య ఆలోచన బాగుందని హెచ్ఎంకు మంత్రి అభినందనలు తెలిపారు. అందరం కలిసి విద్యాప్రమాణాలు పెంచుదామని, పిల్లల విద్య, శారీరక, మానసిక వికాసానికి కృషిచేసి, వారి బంగారు భవిష్యత్కు బాటలు వేద్దామని ట్వీట్ చేశారు.
ఉపాధ్యాయుడు రమణ ఆవేదన ఇప్పుడు వైరల్గా మారింది. పిల్లలు చదవడం లేదని, అక్షరం కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు తాము ఏమీ చేయలేకపోతున్నందుకు తను శిక్షించుకుంటున్నానని చెప్పారు. పిల్లలను క్షమాపణ కోరుతూ తాము ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. ఈ రోజుల్లో పిల్లలకు చదువు రాకపోతే వారికి బుద్ధి నేర్పే పద్ధతిలో తాము బెబితే తమపై ఉన్నతాధికారులు, తల్లిదండ్రులు చర్యలు తీసుకుంటున్నారని, తాము ఏమి చేయాలో తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను క్షమించాలని దండం పెట్టి, స్టేజ్పై గుంజీలు తీశారు. తాము మీకు ఏమి చేయలేకపోతున్నందుకే గుంజీలు తీశానని పేర్కొన్నారు. ప్రస్తుతం వీడియో వైరల్గా మారగా, వెంటనే వీడియోపై మంత్రి లోకేశ్ స్పందించారు