Siddaramaiah : నాకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. ఏం చేయాలి..? : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

Karnataka Chief Minister Siddaramaiah : నాకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. స్పీకర్ యుటి ఖాదర్కు బెదిరింపు కాల్స్ వచ్చిందంటూ విలేకరుల ప్రశ్నకు ముఖ్యమంత్రి ఈ విధంగా స్పందించారు.
అవును.. తనకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఏం చేయాలి..? పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. బెదిరింపు కాల్స్ చేస్తున్న వారిని వెంటనే గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని విలేకరులతో చెప్పారు. మంగళూరులో జరిగిన రౌడీషీటర్ సుహాస్ శెట్టి హత్య ఘటన నిందితులను త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు సీఎం తెలిపారు.
మంగళూరులో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యారు. ఐదుగురు వ్యక్తులు నడిరోడ్డుపై చంపారు. దీంతో మంగళూరులో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు గుమిగూడవద్దని ఆంక్షలు విధించారు. ఊరేగింపులు, నినాదాలు చేయడం, ఆయుధాలను పట్టుకెళ్లడాన్ని నిషేధించారు. సుహాస్ను పథకం ప్రకారం హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హత్య వెనుక ఉన్న కారణాలు తెలియరాలేదు.