Vladimir Putin : ఉక్రెయిన్లో పౌరులను వీధి శునకాలగా ఈడ్చుకెళ్తున్నారు : రష్యా అధ్యక్షుడు పుతిన్

Russian President Vladimir Putin : రష్యా-ఉక్రెయిన్ రెండుదేశాల మధ్య మరికొన్ని గంటల్లో శాంతి చర్చలు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ సైన్యంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉక్రెయిన్ పౌరులను బలవంతంగా సైన్యంలో చేరుస్తోందని ఆరోపించారు. బిజినెస్ రష్యా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విషయాన్ని స్పుత్నిక్ న్యూస్ తన కథనంలో వెల్లడించింది.
బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటోంది..
బిజినెస్ రష్యా ఆర్గనైజేషన్ సమావేశంలో పుతిన్ మాట్లాడారు. ఉక్రెయిన్ తన దేశంలో ప్రజలను బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటోందని ఆరోపించారు. రష్యాలో యుద్ధంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్న వలంటీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని పేర్కొన్నారు. తమ సైన్యం భయపెట్టడం కంటే స్వచ్ఛందంగా చేర్చుకోవడాన్ని నమ్ముతుందన్నారు. ఉక్రెయిన్ యువతలో సైన్యంలో చేరాలన్న ఆసక్తి లేదన్నారు. కానీ రష్యా యువత మాత్రం మిలిటరీపై ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.
30 వేల మందిని తీసుకెళ్లారు..
ఉక్రెయిన్లో పౌరులను వీధి శునకాలగా పట్టుకొని బస్సుల్లో ఈడ్చుకెళ్తున్నారని పుతిన్ ఆరోపించారు. ఇప్పటి వరకు 30 వేల మందిని తీసుకెళ్లారని చెప్పారు. రష్యాలో అలా కాదని, ప్రజలే స్వచ్ఛందంగా వస్తారని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 60 వేల మంది ముందుకొచ్చినట్లు వెల్లడించారు. ఇటీవల ఉక్రెయిన్లో సైనిక నియామకాలు వివాదంగా మారాయి. పౌరులను పోలీసులు వెంటాడి తీసుకెళ్తున్నారు. నియామకాలను బసిఫికేషన్గా వ్యవహరిస్తారు. బస్సుల్లో తరలిస్తుండటంతో దీనికి ఆ పేరు వచ్చినట్లు తెలుస్తోంది.