Published On:

USA : ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు సంపూర్ణ మద్దతు : ప్రకటించిన అమెరికా

USA : ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు సంపూర్ణ మద్దతు : ప్రకటించిన అమెరికా

US support for India : అగ్రరాజ్యం అమెరికా నుంచి పాక్‌కు మరోసారి చేదు వార్త వెలువడింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము ఇండియా తరఫున నిలబడతామని పేర్కొంది. ప్రధాని మోదీకి సంపూర్ణ మద్దతు ఇస్తామని ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి టామీ బ్రూస్‌ వెల్లడించారు. ఆమె రోజువారీ విలేకరుల సమావేశంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ బాధ్యతాయుతంగా శాంతికోసం అవసరమైన పరిష్కారంపై పనిచేయాలని యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యలను ఆమె పునరుద్ఘాటించారు. ఇండియా-పాకిస్థాన్ ఉద్రిక్తతలను అగ్రరాజ్యం చాలా జాగ్రత్తగా గమనిస్తోందని పేర్కొన్నారు.

 

ప్రధాని మోదీతో మాట్లాడిన ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గత వారం ప్రధాని మోదీతో మాట్లాడారు. తమ సంపూర్ణ మద్దతు భారత్‌కు తెలిపారు. ట్రెర్రరిజానికి వ్యతిరేకంగా ఇండియా తరఫున నిలుస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఇక తమ విదేశాంగ మంత్రి రెండుదేశాలు చర్చలకు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నారని, అదే దక్షిణాసియాలో శాంతి నెలకొల్పుతుందని పేర్కొన్నారు. తాము రెండు దేశాల ప్రభుత్వాలతో టచ్‌లో ఉన్నామని బ్రూస్‌ వెల్లడించారు.

 

ఉగ్రదాడిని ఖండించిన అమెరికా విదేశాంగ మంత్రి..
ఇటీవల అగ్రరాజ్యం అమెరికా విదేశాంగ మంత్రి రూబియో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌తో మాట్లాడారు. జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిని ఖండించాలని సూచించారు. అదే సమయంలో పాకిస్థాన్ అధికారులు దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని కోరారు. రెండు దేశాలు ప్రత్యక్ష సంబంధాలను పునరుద్ధరించుకోవాలని తెలిపారు.

 

భారత్ ప్రతి స్పందించడం సరైనదే : జేడీ వాన్స్
తాజాగా అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఉగ్రవాదం విషయంలో ఇండియా తరఫున స్పందించారు. పర్యాటకులపై ఉగ్రదాడి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనికి ఇండియా ప్రతి స్పందించడం సరైనదేనని స్పష్టం చేశారు. అది విస్తృత ప్రాంతీయ సంఘర్షణలకు దారితీయని విధంగా ఉంటుందని తాము విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. పాక్ కూడా ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆశిస్తున్నామని చెప్పారు. కొన్నిసార్లు పాకిస్థాన్ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులను వేటాడటంలో ఇండియా చేస్తున్న ప్రయత్నాలకు వారు సహకరించాలని జేడీ వాన్స్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పహల్గాం దాడి జరిగే సమయానికి వాన్స్‌ సతీసమేతంగా ఇండియా పర్యటనలో ఉన్నారు.

 

ఇవి కూడా చదవండి: