Mock Drills : భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ.. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్

Mock Drills : పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మరోపక్క ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఇండియా మెరుపు దాడులతో గట్టిగా సమాధానం చెప్పింది. జీర్ణించుకోలేని పాక్ తాము దాడులు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తోంది. సంక్షోభ సమయంలో ప్రజలు తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అన్న అంశంపై అవగాహన కల్పించాలని కేంద్రహోం శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్స్ ప్రారంభమయ్యాయి.
మాక్ డ్రిల్స్లో పాల్గొనాలని ఆయా జిల్లా అధికార యంత్రాంగాలు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోమ్గార్డ్స్, ఎన్సీసీ కోర్, ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, కళాశాలలు, పాఠశాల విద్యార్థులకు ఇప్పటికే కేంద్రం పిలుపునినిచ్చింది. దేశవ్యాప్తంగా 244 జిల్లాలో 259 లొకేషన్లలో మాక్ డ్రిల్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 50 ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపడుతున్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. ఈసారి దేశవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు. పాక్ యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు దూసుకొస్తుండగా ప్రజల సన్నద్ధత కోసం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో సైరన్ చాలా కీలకమైంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సైరన్ మోతలు వినిపించాయి.